Showing posts with label కథలు. Show all posts
Showing posts with label కథలు. Show all posts

Saturday 31 December 2016

హిందూ ధర్మాన్ని గురించి నాలుగు ముక్కల్లో చెప్పమంటే ఇట్లా చెప్పవచ్చు!


* ఓం మాతృదేవో భవః

* ఓం పితృదేవో భవః

* ఓం ఆచార్యదేవో భవః

* ఓం అతిధిదేవో భవః

పై నాలుగు ధర్మాలు హిందూ ధర్మానికి మూల స్థంభాలు. ఈ నాలుగు ధర్మాలపైనే హిందూ జాతియొక్క నిర్మాణం జరిగిందని చెప్పటంలో అతిశయోక్తి లేదనే చెప్పాలి. అమ్మా,నాన్నలను; గురువులను, అతిథిలను ఎలా గౌరవించాలో, ప్రేమించాలో మన హిందూ శాస్త్రాలెన్నో కథల రూపంలో సవివరంగా చెప్పాయి.

శంఖంలో పోస్తేకానీ తీర్ధం కాదని నానుడి. అలాగే మొక్కై వంగనది మ్రానైవంగునా అనేదికూడా మరొక నానుడి. ఊహ తెలుస్తున్న వయసులో పిల్లల్లో శబ్దగ్రహణ శక్తి; విషయ గ్రహణ శక్తి; జ్ఞాపకశక్తి ఎక్కువగా వుంటుందని నాటి, నేటి శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఇదే విషయం ఆధారంగా, మంచి విషయాలను పిల్లలకు ఊహ తెలుస్తున్న వయస్సుల్లోనే ఉగ్గుపాలు పోసినట్ట్లుగా తెలియచేయాలని మన పూర్వీకులు నిర్ణయించారు.

మరి మన పూర్వీకులు పై విషయంలో ఏం చేసారు? సాధారణంగా మన ప్రపంచం పురుషాధిక్యత ప్రపంచం. స్త్రీకి రెండవ స్థానం ఇవ్వబడింది. ఇది సమసమాజానికి చేటు చేస్తుందని తెలిసే, మన పూర్వీకులు ప్రతి చోటా స్త్రీని మెదట స్థానంలో వుంచటానికి ప్రయత్నించారు. అందుకు మొదట ఉదాహరణే ‘ మాతృదేవో భవః ’ అని చెప్పటం. సీతారాములు; లక్ష్మీనారాయణులు; ప్రకృతి,పురుషుడు మరికొన్ని ఉదాహరణలు.

భూమి తనయొక్క ఆకర్షణచే ప్రతి జీవరాశిని తన అధీనంలో ఉంచుకుంటుంది (దీనివల్ల ఎన్నో సృష్టి లాభాలున్నాయి). భూమ్యాకర్షణలాగే, భౌతికమైన ఈ జగత్తులో, పుట్టుకతోనే ప్రతి జీవి, ముఖ్యంగా “ మనిషి ” తన జీవన మనుగడకోసం భౌతిక విషయాలపట్ల ఎక్కువగా ఆకర్షింపబడివుంటాడు. వాటి ఆకర్షణ వలలో పడిపోయి, తనయొక్క మూలాల్ని మరిచిపోతుంటాడు. ఒకానొక దశలో కేవలం ఒక మర మనిషిగా; సుఖాలకోసమే బ్రతకాలి అన్న ఒక్క మిషలో పడిపోతాడు. అప్పుడు సమాజం మిధ్యాలోకంలోనే కొట్టుమిట్టులాడుతూ వుంటుంది.

ఉగ్గుపాలు పోసినట్లుగా, మంచి విషయాలను పిల్లలకు చిన్నప్పుడే బోధించాలి అని పైన చెప్పుకున్నాంగదా. అందులోని భాగంగా, పిల్లలకి అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఒక ‘మంత్రాన్ని’ మన పూర్వీకులు ఉపదేశించారు. అదే, “ ఓం నమఃశివాయః సిద్ధం నమః ” (అక్షరాభ్యాసం -అనే శీర్షికతో నాచే వ్రాయబడిన వ్యాసాన్నికూడా చదవగలరు). ఇంతకీ ఈ మంత్రానికీ, స్త్రీకి, పురుషునితో సమాన హోదా ఇవ్వటానికీ; మన హిందూ ధర్మానికీ ఏమిటి సంబంధం? అని సందేహం ఎవరికైనా రావచ్చు. మరి, మరికొంత ముందుకు చదవండి:

ఓం నమః = ఓం అంటే ప్రణవ నాదం; ఈ చైతన్య జగత్తుకు మూల నాదం; అటువంటి ప్రణవ నాదానికి నా నమస్కారములు అని మొదటగా ఆ చిన్న విద్యార్ధి చిలుక పలుకులు పలుకుతూ, మంత్రాన్ని వల్లె వేయటం మొదలుపెడతాడు.

శివాయః = ఈ పదం, ‘ శ్ + ఇ + వ్ + అ ’ అనే అక్షరాల కూర్పు. ‘ఇ’ = ఈ అక్షరం అమ్మ లేదా అమ్మవారిని సూచిస్తుంది; ‘అ’ = ఈ అక్షరం అయ్య లేదా అయ్యవారిని సూచిస్తుంది; భౌతికమైన ఈ జగత్తు నిర్మాణానికి ‘తల్లి, తండ్రు’లు మూలాలు. ఈ ఇద్దరి కలయికవలనే జగత్తు నిర్మాణం సాకారమవుతుంది. వీరిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా జగత్తు నిర్మాణం జరగదు. ‘శివ’ అనే పదం ‘శక్తి’ని సూచిస్తుంది. ఈ శక్తి అమ్మ, అయ్యవార్ల కలయిక వలననే జరుగుతుంది; ‘శ్+ఇ+వ్+అ’ ల అక్షరమాలలో ‘ఇ’ అక్షరం వున్నప్పుడే, ఆ పదం ‘శివ’ గా వుంటుంది; అందులోని ‘ఇ’ ని తీసివేస్తే, అది ‘శ్+వ్+అ’ = శవ అనే పదంగా మారుతుంది. అంటే, శివం, శవంగా మారిపోతుంది. శివం శక్తిమయం; శవం శక్తి హీనం. – కాబట్టి, అట్టి శక్తిమయమైన జగత్తుకు కారణభూతులైన అమ్మ, అయ్యవార్లకు, ఓం నమః = నమస్కరిస్తూ …

సిద్ధం నమః = అటువంటి జగత్ సృష్టికి మాతాపితలైన (లేదా నా పుట్టుకకు మూలకారణమైన నా తల్లి,తండ్రులకు ) వారియొక్క ఆశీస్సులు సదా నాకు ‘సిద్ధించాలి కోరుకుంటూ, నమస్కరిస్తున్నాను’….

అనే అర్ధంతో ఆ మంత్రాన్ని మన పెద్దలు మనకు ఊహ తెలియటం మొదలవుతుండగానే మననం చేయించారు. మొక్కగా వున్నప్పుడే మనసులో పడిన ఆ భావంయొక్క అర్ధం పెద్దయిన తరువాత మానుగా మనస్సులో నిలబడిపోయి, మన తల్లి,తండ్రులను గౌరవించటం, ప్రేమించటం, అలవాటు అవుతుందని చెప్పటంలో ఎటువంటి అనుమానం వుండనక్కరలేదు.

పై విషయాల్ని, ఆదిశంకరులు తమ ‘సౌందర్యలహరి’ లో మొట్టమొదటి శ్లోకం, “శివశ్శక్త్యా యుక్తో యది భవతి శక్తః” లో మనందరికీ తెలియచేసారని పండితులు తమతమ భాష్యాలలో మనకు చెప్పటం జరిగింది. మరి మన కర్తవ్యం ఆ మంత్రాన్ని మనం చేసి, చేస్తూ, చేయిస్తూ వుండటమే!! స్వస్తి.

న్యూ ఇయర్

ఈ మెసేజ్ జనవరి ఒకటి కంతా తెలుగు వారికందరికీ అందిద్దాం.
అసలీ జనవరి 1 కథ ఏంటి? ఏప్రిల్ ఫూల్ ఎందుకొచ్చింది?
నాకు చాలా మంది మిత్రులు జనవరి ఒకటిన "విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ " అని అభిమానంగా, సంతోషంగా చెబుతారు. అది వారి ప్రేమకు తార్కాణం. కానీ నేనిప్పటిదాకా నాకు బుద్ధొచ్చాక నేనైనేను ఎవరికీ చెప్పలేదు. (నా పై అధికారులకు తప్ప).
ఇలా విషెస్ చెప్పే వారిది ఏ తప్పూ లేదు. ఎందుకంటే మనకెవ్వరికీ జనవరి ప్రారంభం న్యూ ఇయర్ కాదని తెలియదు. ఇక ఎంజాయ్ ఎంజాయ్ అని త్రాగి తిరిగే వాళ్ల కథ నాకు తెలియదు. ఇక పై ప్రశ్నలకు సమాధానం చూద్దాం.
ఇప్పుడు మనం అనుసరించే క్యాలెండర్‌ గ్రెగేరియన్ క్యాలెండర్. ఇదంతా తప్పులతడక, లోపాల పుడక.క్రీశ 1582 లో పోప్ గ్రెగేరియన్ సరిచేసిన క్యాలెండర్ ఇది.ఈ క్యాలెండర్ ప్రకారం మనం యదార్థ సంవత్సరం కంటే 24.6 సెకన్ల ఎక్కువ సమయాన్ని లెక్కించుకుంటున్నాము. ఆప్రకారం 3,513. సంవత్సరాలకు ఒక రోజు ఎక్కువ వస్తుంది. ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త JOHN VERSHAL. ఈ లోపాన్ని సవరించటానికి ఒక ఉపాయం చెప్పాడు. అదేంటంటే, క్రీశ 4,000 సంవత్సరంను లీప్ ఇయర్ గా లెక్కించకుండా వదిలేయడం.
ఈ క్యాలెండర్ లోని లోపాలను సరిచేయడం అవసరమని సూచనలు చేస్తూ "నానాజాతిసమితి" ఒక కమిటీ ఏర్పాటుచేసింది. ఆ కమిటీ 185 రకాల ప్కాన్లను పరిశీలించి, క్రీశ 1926 లో ఒక రిపోర్టు ఇచ్చింది. ఇప్పటి దాకా అది ఎటూ తేలలేదు లెండి. ఇంకా ఇలాంటి చిన్నచిన్న చిక్కులు చాలానే ఉన్నాయి. మంచిది...
ప్రపంచమంతా ఒకప్పుడు నూతన సంవత్సరం ఉగాదినాడు ప్రారంభమయ్యేది. బైబిల్ లోని ""ఎజ్రా "" పుస్తకం 10:17 వ వచనం సంవత్సరం లోని మొదటి నెల మార్చి - ఏప్రిల్ లో ప్రారంభమౌతుందని సాక్ష్యం పలుకుతోంది. ఫ్రాన్స్‌ లో క్రీశ 1582 వరకూ, ఇంగ్లాండులో క్రీశ 1752 వరకూ నూతన సంవత్సరం మార్చి 25 న ప్రారంభం అయ్యేదని చరిత్ర చెబుతూంది. అయితే, కాలగమనంలో ఇది ఎప్పుడు మారిందో తెలియదు కానీ, అది ఏప్రిల్‌ కు మారింది. అయితే నూతన సంవత్సరం మార్చి లో ఉంచాలా, ఏప్రెల్ లో ఉంచాలా అనేది వారికి కొంత సమస్యగా మారింది. సంవత్సరం ఆరంభం ఎప్పుడూ ఒకే నెలలో ఒకే తేదీన వస్తే బాగుంటుంది అని వారు ఆలోచించసాగారు. ఆ సమయం లో క్రీశ 15 శతాబ్ది చివరి కాలంలో ఫ్రాన్స్‌ చక్రవర్తి " చార్లెస్ "అంతవరకూ 11 వ నెలగా ఉన్న జనవరి ని ఒకటవ నెలగా నూతన సంవత్సరం గా ప్రారంభించాడు.ఈ విధంగా నేటి మన నూతన సంవత్సరం ప్రారంభమైంది. 
ఇందుకు ఎలాంటి శాస్త్రీయ, ప్రకృతి పరమైన, ఆధారమూ లేదు. ముందుగా ఫ్రాన్స్‌, ఇటలీ, పోర్చుగీసు, స్పెయిన్ దీనిని అంగీకరించాయి. క్రీశ 1699 లో జర్మనీ, క్రీశ 1752లో ఇంగ్లండు, క్రీశ 1873 లో జపాన్‌, క్రీశ 1912 లో చైనా, క్రీశ 1916 లో బల్గేరియా, క్రీశ 1918 లో రష్యా లు ఈ క్యాలెండర్ ను అంగీకరించాయి. 17,18 శతాబ్దంలో తమ ఆధీనంలో ఉన్న అన్ని దేశాలలో బ్రిటిషు వాడు దీన్ని ప్రవేశపెట్టాడు.
కానీ భారతీయ క్యాలెండర్ ఋషులచే తయారుచేయబడింది. ఆర్యభట్టు, భాస్కరాచార్య వంటి మహాన్ శాస్త్రజ్ఞులచే పరిశోధించబడింది. కొన్నివేల సంవత్సరాల తర్వాత ఏ సంవత్సరం లో, ఏ నెలలో, ఏ రోజున ఏ గ్రహణం వస్తుందో, వారం వర్జ్యము తో సహా చెప్పగలిగేంతగా శోధించబడింది.
ప్రకృతి కి అనుగుణంగా, వసంత ఋతువు చైత్రశుద్ధ పాఢ్యమి రోజున ఉగాది ప్రారంభ మవుతుంది. (కొన్నిచోట్ల వసంత ఋతువు మేశరాశి లో సూర్యుడు ప్రవేశించటాన్ని ఉగాదిగా చేస్తారు.) 
ప్రపంచమంతా మొదటి నుంచీ అనుసరిస్తున్న ఉగాదిని కాదని, వాడెవడో ఫ్రాన్స్‌ వాడు ఏ ఆధారమూ లేకుండా ప్రతిపాదించిన నూతన సంవత్సరం ను ఫాలో అవడం కంటే, ఆత్మాభిమానం కలిగి భారతీయుల మందరమూ మన సాంప్రదాయక ఉగాది నూతన సంవత్సరం ను ఫాలో కావటం ఉత్తమము మరియు మన కర్తవ్యము. 
ఏ లోపాలు లేని మన కాలమానం గొప్పతనాన్ని ప్రచారం చేయటమే మన తక్షణ కర్తవ్యం. ఈ మెసేజ్ జనవరి 1 లోగా తెలుగు వారికంతా వెళ్లేలా చేస్తే, సగం పని జరిగినట్లే.

 భారత్ మాతా కీ జయ్.
పెద్దల ద్వారా విన్నదాన్ని మీకు విన్నవించాను.

Friday 30 December 2016

రమణ మహర్షి !



ఎవరి బోధా లేకుండా, తనంత తానే ఆత్మజ్ఞానిగా రూపొందినవారు రమణ మహర్షి. సుఖదుఃఖాలకు అతీతంగా జీవించి, ‘మహర్షి’ పేరును సార్థకం చేసుకున్నారు. ఆయనలో అప్రయత్నంగా కలిగిన ఆత్మవిచారం సహజ నిర్వికల్ప స్థితికి దారితీసింది. అరుణాచలం ఆయనకు ఆధ్యాత్మిక కేంద్రమైంది. అది ఈశ్వరుడి హృదయ స్థానం. ఆ జ్యోతిర్లింగ దివ్యకాంతులు రమణులపై ప్రసరించాయి.
అది 1879 డిసెంబరు 30. తమిళనాడులోని తిరుచుజి గ్రామవాసులైన అలగమ్మ, సుందరమయ్యర్‌ దంపతులకు వేంకటరామన్‌ జన్మించారు. అదే రమణమహర్షి అసలు పేరు. ఆ బాలుడు దిండిగల్‌ బడిలో సాధారణ విద్యార్థి. చదువు అంతగా పట్టుబడకున్నా, ఏకసంథాగ్రాహి కావడం వల్ల అన్నింటా నెగ్గుకొచ్చాడు. మధుర మీనాక్షిని దర్శించి, ఆధ్యాత్మిక అనుభూతి పొందాడు.
చదువుపై అతడి అశ్రద్ధ చూసి అన్న మందలించాడు. ఈ లౌకిక విద్యలన్నీ వ్యర్థమని వేంకటరామన్‌కు స్ఫురించింది. ఇల్లు వదిలి తిరువణ్ణామలై వెళ్లారు. భూగర్భ మందిరంలో ధ్యాన నిమగ్నుడయ్యారు. ఆయనను దర్శించేవారి సంఖ్య పెరిగింది. ఒకరోజు కుమారుణ్ని వెతుక్కుంటూ తల్లి వెళ్లింది. ఆమెకు పెన్సిల్‌తో ఒక సందేశం రాసిచ్చారు... ‘ప్రతి ప్రాణికీ కర్మను అనుసరించి జీవితం ఉంటుంది. అతడు ఎంత ప్రయత్నించినా, జరిగేది జరగక మానదు’ అని!
ఆయనకు ఉపన్యాస ధోరణి లేదు. శిష్యుల సందేహాలకు సూటిగా సమాధానాలిచ్చేవారు. అనేక దేశాల నుంచి పలువురు తమ సందేహాలు తీర్చుకోవడానికి రమణ మహర్షిని ఆశ్రయించేవారు. ఆత్మజ్ఞానం కలిగినవాడే ‘గురువు’ అని ఆయన చెబుతుండేవారు.
‘శ్రీరమణ సద్గురు’ అని శిష్యులు ఆయనను పిలిచేవారు. జిజ్ఞాసువుల ప్రశ్నలకు ఆయన ఇచ్చిన జవాబులు ‘శ్రీరమణ గీత’గా ప్రసిద్ధి చెందాయి. హంఫ్రీస్‌ అనే పాశ్చాత్యుడు ఓ అంతర్జాతీయ మనోవిజ్ఞాన శాస్త్ర పత్రికలో రాసిన వ్యాసం వల్ల, ఆయన ప్రఖ్యాతి అంతటా వ్యాపించింది. సూరినాగమ్మ ‘రమణాశ్రమ లేఖలు’ తెలుగు ప్రజలకు ఆయనను మరింత చేరువ చేశాయి. ‘ఎ సెర్చ్‌ ఇన్‌ సీక్రెట్‌ ఇండియా’ గ్రంథకర్త పాల్‌ బ్రంటన్‌- రమణ మహర్షి వైభవాన్ని స్తుతించారు. మనశ్శాంతి కోసం వెళ్లిన కావ్యకంఠ గణపతి ముని ఆయనలోని మహాపురుషుణ్ని దర్శించారు.
శ్రీరమణుల భూతదయకు అంతు లేదు. పశుపక్ష్యాదులను ఆదరంగా చూసేవారు. కోతులు, ఉడతలు, పిచ్చుకల పట్ల దయాభావం చూపేవారు. జంతుభాష ఆయనకు అర్థమయ్యేది. ఒకరోజున ఓ ముసలి కోతి భుజాన కోతిపిల్ల ఉండటం చూశారు. ‘తాతా! ఎంత కష్టం వచ్చింది నీకు... ఈ వయసులో బిడ్డను పెంచాల్సి వచ్చిందే... జాగ్రత్తగా సాకు... ఇది నీకు పుణ్యమే’ అన్నారు గద్గద స్వరంతో. ఆ కోతిపిల్లకు తల్లి చనిపోయింది. తల్లిలేని పిల్లను పెంచాల్సిన బాధ్యత పెద్ద కోతిదే! ఈ విషయం మహర్షికి తెలుసు. అలాగే ఆయన ఒక గోవుకు లక్ష్మి అని పేరుపెట్టి పెంచారు.
కృష్ణుడు రేపల్లె విడిచి వెళ్లేటప్పుడు గోపికల శోకం, రామాయణ గాథలో ‘తారా విలాపం’ కథాభాగం వింటున్నప్పుడు- అనుభూతితో ఆయనకు కన్నీళ్లు ఆగేవి కావు. అదీ రమణ మహర్షి మనసు! అతి క్లిష్టమైన ఆధ్యాత్మిక విషయాన్ని సైతం అతి సులభ శైలిలో అందరికీ అర్థమయ్యేలా వివరించేవారు.
శ్రీరమణులు ‘ఆత్మవిచారం’, ‘నేనెవరు’ అనే గ్రంథాల్ని రచించారు. ‘భగవంతుడు శాశ్వతుడు. ఎక్కడికీ పోడు!’ అని బోధించారు. ‘నేను ఎప్పటికీ వెళ్లను. ఇక్కడే ఉంటాను’ అని చెప్పేవారు. అరుణాచలంలోని రమణాశ్రమంలో ఆయన ఉన్నారనే దివ్యానుభూతి సందర్శకులకు ఇప్పటికీ కలుగుతుంటుంది. మహర్షి కరుణపూరిత నేత్రాలు వారిపై ప్రేమామృతాన్ని వర్షిస్తుంటాయి. అద్భుత సందేశాలు వారికి ఇంకా వినిపిస్తూనే ఉంటాయి!

డిసెంబర్ 30 "శ్రీ భగవాన్ రమణ మహర్షి" జయంతి

🌻🌹భగవాన్ శ్రీ రమణ మహర్షి🌹🌻

🍀రమణ మహర్షి తత్వం : అద్వైత వేదాంతము

🍀ఉల్లేఖన : మేధస్సులో ఉద్భవించే ఆలోచనల పరంపరలో మొదటి ఆలోచన నేను అనునది.

🍀శ్రీ రమణ మహర్షి (తమిళం : ரமண மஹரிஷி) (డిసెంబరు 30, 1879 – ఏప్రిల్ 14, 1950), పుట్టుక పేరు వెంకట్రామన్ అయ్యర్, ఒక భారతీయ ఋషి. ఇతను తమిళనాడు తిరుచ్చుళి లోని ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానము పొంది తిరువణ్ణామలై లోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డాడు.బ్రాహ్మణ కుటుంబములో జన్మించిననూ మోక్షజ్ఞానము పొందిన తరువాత తనను "అతియాశ్రమి"గా ప్రకటించుకున్నాడు.

🍀రమణ మహర్షి బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవాడు, తన మౌనముతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవాడు.వీరి బోధనలలో విశ్వజనీయమైన ఆత్మజ్ఞానం ప్రధానాంశంగా వుండేది.ఎవరైనా ఉపదేశించమని కోరితే, "స్వీయ శోధన" ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షము సులభ సాధ్యమని బోధించేవాడు. తమ అనుభవము అద్వైతం, జ్ఞానయోగా లతో ముడిపడి ఉన్నా కూడా అడిగినవారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గములని కూడా బోధించేవాడు.

🌷కుటుంబ నేపథ్యం🌷

🍀శ్రీ రమణ మహర్షిగా ప్రఖ్యాతి గాంచిన ఈయనకు తల్లి తండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్. భగవాన్ భారతదేశం లోని తమిళనాడు రాష్ట్రంలోని మధురై జిల్లాలోని తిరుచ్చుళిలో 1879 డిశంబరు 30వ తేదీ 'ఆరుద్ర దర్శనం (పునర్వసు నక్షత్రము) ' నాడు జన్మించాడు. శ్రీ భగవాన్ గారి తల్లి తండ్రులు శ్రీమతి అళగమ్మాళ్, శ్రీ సుందరేశం అయ్యర్లు. శ్రీ భగవాన్ గారికి ఇద్దరు సోదరులు (నాగస్వామి, నాగ సుందరం) ఒక సోదరి (అలమేలు). సుందరేశ అయ్యర్ గారు అక్కడ ప్లీడరుగా పని చేసే వాడు.

🌷బాల్యం🌷

🍀పూర్వాశ్రమంలో భగవాన్ అందరు పిల్లల లాగే సాధారణంగా ఉండేవాడు. అపారమైన దేహదారుఢ్యం కలిగి ఉండేవాడు. బాల్యంలో చదువు మీద ఆసక్తి చూపించేవాడు కాదు. తిరుచ్చుళిలో సరైన విద్యాసౌకర్యం లేకపోవడం వలన వాళ్ళ చిన్నాన్న వద్దకు (సుబ్బాయ్యర్) వెళ్ళాడు. రమణులు చిన్నతనంలో బాగా నిద్ర పోయేవాడు. ఎలాంటి నిద్ర అంటే ఆయన నిద్రపోయినప్పుడు తోటి పిల్లలు ఆయన్ని నడిపించి దూరంగా తీసుకువెళ్ళి బాదినా ఆయనకు తెలిసేదికాదు. ఈయన అసలు పేరు వేంకటేశ్వర. ఒకసారి పాఠశాలలో వేంకటేశ్వర అని రాయమంటే వెంకట్రామన్ అని రాయడం చేత వెంకట్రామన్ అని పిలవడం ప్రారంభం అయింది. రమణ గారి తండ్రి చనిపోవడం వాళ్ళ సుబ్బయ్యర్ గారు నాగస్వామి (రమణ గారి అన్నయ్య), రమణ లను మధురై తీసుకుని వెళ్ళిపోయాడు. రామస్వామి అయ్యర్ అనే ఆయన అరుణాచలం వెళ్ళివస్తుండగా రమణులు పలకరించి ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడిగాడు. ఆయన అరుణాచలం నుంచి వస్తున్నాను అని చెప్పగా, ఆమాట విన్న తరువాత ఆయనలో ఏదో తెలియని గొప్ప అనుభూతి కలిగింది. అప్పటి నుంచి అల్లరిచేయండం, రుచుల కోసం ప్రాకులాడటం మానేశాడు.

🌷బోధనలు🌷

🍀స్వీయ-శోధన ద్వారా మాత్రమే "జ్ఞాన మార్గము". వీరి బోధనలలో హిందూమత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు మరియు అద్వైత వేదాంతములనే కాకుండా, అనేక మత సారములను మార్గాలను తన బోధనలలో బోధించేవారు.

🍀"The state in which the unbroken experience of existence-consciousness is attained by the still mind, alone is samadhi. That still mind which is adorned with the attainment of the limitless Supreme Self, alone is the reality of God.
It is SAHAJ SAMADHI. From here you have samadhan (steadiness) and you remain calm and composed even while you are active. You realize that you are moved by the deeper real Self within. You have no worries, no anxieties, no cares, for you come to realize that there is nothing belonging to you. You know that everything is done by something with which you are in conscious union.
"In samadhi itself there is only perfect peace. Ecstasy comes when the mind revives at the end of samadhi. In devotion the ecstasy comes first.. It is manifested by tears of joy, hair standing on end, and vocal stumbling. When the ego finally dies and the Sahaj is won, these symptoms and the ecstasies cease."

🌷శ్రీ రమణ మహర్షి శిష్యులు🌷

🍀కావ్యకంఠ గణపతిముని

🍀యోగి రామయ్య

🌷భగవాన్ గురించి చలం🌷

🍀భగవాన్ బోధించే వేదాంతమూ, ఆయన 'ప్రిస్క్రిప్షన్లూ' నాకు సమ్మతం కావు. ఆయన గంభీరత్వంలోనూ, లోకం మీద ఆయనకి వున్న సంపూర్ణ నిర్లక్ష్యం మీదా గౌరవం నాకు. ఆయన ఆత్మ సౌందర్యం ఆయన ప్రేమా నేను వొప్పుకుంటాను. నాకు స్త్రీ వుంది. మీకు దేవుడున్నాడు.స్త్రీ తప్ప నన్ను గట్టిగా కదిలించగలది ఏదీ లేదు. స్త్రీ కోసం జీవితాల్ని ధ్వంసం చేసుకున్న వాళ్లని, అంటే కీర్తీ, డబ్బూ కాదు- అంతకన్న శ్రేష్టమైనవి -జీవితం మీద ఆసక్తినీ-శక్తినీ-బతకడంలో ఆనందాన్నీ, (Grip on Life and Joy of Living) పోగొట్టుకున్న వాళ్లని చూస్తే నేను చాలా వెవేకవంతుణ్ణిగా తోస్తాను.

🍀చెలం 1950 లో తిరువణ్ణామలై వెళ్ళిపోయారు. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొన్నారు. రమణ మహర్షి ఆశ్రమానికి ఎదురుగా వున్న 'మహాస్థాన్ ' ఆవరణ ఇంట్లో అద్దెకి ఉన్నారు. ఆ తరువాత అక్కడ ఒక ఇంటిని కొన్నారు. దాని పేరే రమణస్థాన్.ఈ ప్రదేశమంతా యోగులమయం. దొంగయోగులు లేరు. ఏమీలేని బోలుయోగులూ, ఏదో కొంతవరకు సాధించి స్థిమితపడ్డ మహనీయులూ కనపడేవారు చాలా కొంచెం. చాలామంది కనపడరు.భగవాన్ పోగానే తగాదాలు ఆశ్రమంలో! బ్రాహ్మణ, అబ్రాహ్మణ, అరవ, ఆంధ్ర, పరదేశీయులు ఒక జట్టు ఐనారు. లేచిపోతున్నారు.రౌడీలు, పోలీసు కాపలాలు - ఒక్క ఆత్మ మౌనమైన రూపుతో ఇన్నేళ్ళు పరిపాలించిన ఆశ్రమం. కృష్ణుడు పోగానే అర్జునుడు ఏడ్చిన ఏడుపు జ్ఙాపకం వొస్తోంది. ద్వారక ఏమయిందో - ఆనాడు - నిజంగానో, కవి హృదయంలోనో, అట్లావుంది లోకం నాకు!ఇప్పుడు ఆశ్రమం పిశాచం మల్లే, ఒక కలమల్లే వుంది. ఎక్కడివాళ్ళక్కడ లేచిపోయినారు. చాలా వొంటరితనం. మా వాళ్ళు 15 రోజులకిందటే వెళ్ళిపోయినారు. అదో చిత్రమైన వ్యవహారం 'చే ' బొంబాయిలో, 'షౌ ' మద్రాసులో, 'చిత్ర ' పశుమలైలో తక్కినవాళ్ళెక్కడ వున్నారో తెలీదు. ఎప్పుడు వస్తారో రారో తెలీదు. ఎవరైనా నన్ను గుర్తించి పలకరిస్తే చాలునన్నంత దీనావస్థలో! when you were in Thiruvannamalai go for a walk around the hill. The Arunachala hill will gives the power to all the hill itself called (Tejolingam). Shankara charya we sat in the hill and done the mediatation around the hill. if you can for a while into the hill you can catch the power.

Sunday 18 December 2016

అర్జున విషాదయోగః 1 (అథ ప్రథమోధ్యాయః, శ్రీ భగవద్గీత)

Mahabharatam

ధృతరాష్ట్ర ఉవాచ : -

ధర్మక్షేత్రే కురుక్షేత్రే
సమవేతా యుయుత్సవః,
మామకాః పాణ్డవాశ్చైవ
కిమకుర్వత సంజయ!

ధృతరాష్ట్రుడిట్లు పలికెను: ఓ సంజయా! నా వారలగు దుర్యోధనాదులను, పాండుపుత్రులగు ధర్మరాజాదులను యుద్ధము చేయ కుతూహలముతో పుణ్యభూమి యగు కురుక్షేత్రమున జేరి యేమిచేసిరి?


సంజయ ఉవాచ :-

దృష్ట్వా తు పాణ్డవానీకం
వ్యూఢం దుర్యోధన స్తదా‌,
ఆచార్యముపసజ్గమ్య
రాజా వచనమబ్రవీత్‌.

ధృతరాష్ట్రునితో సంజయడిట్లు వచించెను :- అపుడు రాజైన దుర్యోధనుడు ప్యూహాకారము గాంచింపబడియున్న పాండవసేనను చూచి, తదుపరి గురువగు ద్రోణాచార్యుని సమీపించి యిట్లు పలికెను.


పశ్యైతాం పాణ్డుపుత్రాణా
మాచార్య మహతీం చమూమ్‌,
వ్యూఢాం ద్రుపదపుత్రేణ
తవ శిష్యేణ ధీమతా.

ఓ గురువర్యా! బుద్ధిశాలియు, మీ శిష్యుడునగు ధృష్టద్యుమ్నునిచేత ప్యూహాకారముగ రచింపబడియునట్టి పాండవుల ఈ గొప్ప సైన్యమునుజూడుడు!


అత్రశూరా మహేష్వాసా
భీమార్జున సమా యుధి,
యుయుధానో విరాటశ్చ
ద్రుపదశ్చ మహారథః.

ధృష్ట కేతు శ్చేకితానః
కాశీరాజశ్చ వీర్యవాన్‌,
పురుజిత్కుంతి భోజశ్చ
శైబ్యశ్చ నరపుజ్గవః

యుధామన్యుశ్చ విక్రాంత
ఉత్తమౌజాశ్చ వీర్యవాన్‌,
సౌభద్రో ద్రౌపదేయాశ్చ
సర్వ ఏవ మహారథాః

ఈ పాండవసేనయందు గొప్ప విలుకాండ్రును, యుద్ధమునందు భీమార్జునులతో సమానులునగు శూర వీరులును పెక్కురు కలరు. వారెవరనిన - యుయుధానుడు, విరాటుడు, మహారథుడైన ద్రుపదుడు, ధృష్టకేతువు, చేకితానుడు, పరాక్రమవంతుడగు కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరోత్తముడగు శైబ్యుడు, శౌర్యవంతుడగు యుధామన్యుడు, పరాక్రమశాలియగు ఉత్తమౌజుడు, అభిమన్యుడు, ఉపపాండవులు. వీరందరును మహారథులే అయియున్నారు.


అస్మాకం తు విశిష్టా యే
తాన్నిబోధ ద్విజోత్తమ,
నాయకా మమ సైన్యస్య
సంజ్ఞార్థం తాన్‌ బ్రవీమి తే.

ఓ బ్రాహ్మణోత్తమా! ఇక మనసైన్యములో ప్రముఖులు, సేనానాయకులు ఎవరు కలరో వారలను జ్ఞాపకము కొరకు మీకు చెప్పుచున్నాను.(వినుడు)


భవాన్‌ భీష్మశ్చ కర్ణశ్చ
కృపశ్చ సమితింజయః,
అశ్వర్థామా వికర్ణశ్చ
సౌమదత్తి స్తథైవ చ

అన్యే చ బహవశ్శూరా
మదర్థే త్యక్తజీవితాః,
నానాశస్త్ర ప్రహరణా
స్సర్వే యుద్ధవిశారదాః.

మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధమందు జయశీలుడైన కృపాచార్యుడు, అశ్వర్థమ, వికర్ణుడు, భూరిశ్రవుడు, ఇంకను నాకొరకు తమ తమ జీవితములను ధారబోయునట్టి అనేక ఇతర శూరులు, అందరును యుద్ధసమర్థులై వివిధ శస్త్రాస్త్ర సంపన్నులై ఇచట నున్నారు. 

తిరుప్పావై నాల్గవరోజు పాశురం


4.పాశురము :


*    ఆళి మళైక్కణ్ణాః ఒన్ఱు నీ కైకర వేల్
    ఆళి యుళ్ పుక్కు మగన్ధు కొడార్ త్తేఱి
    ఊళి ముదల్వనరువమ్ పోల్ - మెయ్ కఱుత్తు
    పాళి య న్దోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
    ఆళి పోల్ మిన్ని వలమ్బురి పోల్ నిన్ఱ దిర్ న్దు
    తాళాదే శార్ ఙ్గం ముదైత్త శరమళై పోల్
    వాళ వులగినిల్ పెయ్ దిడాయ్ - నాజ్గళుమ్
    మార్ గళి నీరాడ్ మాగిళ్ న్దేలో రెమ్బావాయ్.

భావము: ఓ పర్జన్య దైవమా! వర్షమును కురిపించుటలో లోభత్వమును జూపకుము. నీవు సముద్రములోని నీటి నంతను కడుపు నిండుగ త్రాగుము, అటుపిదప నీవు పైకెగసి, సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకును ఆ నలుపురంగు నద్దుకొనుము. స్వామి కుడి చేతియందున్న సుదర్శన చక్రము వలె మెరయుము. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖమువలె గంభీరముగా గర్జించుము. స్వామి సారంగమను ధనుస్సు నుండి వెడలే అవిరళ శరాలుగ వర్షధారలను కురిపించుము. మేమందరము యీ వర్ష ధారలలో స్నానమాడెదము. లోకము సుఖించునట్లు వర్షించుము మా వ్రతమును నిరాటంకముగ జేసికొనుటకై యిక ఏ మాత్రమూ ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామీ!


    అవతారిక


సర్వవ్యాపాకుడైన త్రివిక్రముని వ్యాపకత్వాన్ని యెరిగి ఆ పురుషోత్తముని కొలిచిన కలిగే ఫలితాలను గురించి 3వ పాశురంలో గోదాదేవి వెల్లడించింది. అట్టి పరమాత్ముని యేమరక భక్తితో పూజించే శక్తియుక్తులు కావలెనన్న ముందు శారీరక శుద్ధి, ఆపై అంతర్ శుద్ధి అవసరం కద! అందుకే బాహ్య శుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన వర్జన్యుణ్ణి ప్రార్థంచి వ్రతాంగమైన స్నానానికై వర్షించమని కోరుతున్నదీ పాశురంలో.

    (ఉదయరవిచంద్రిక రాగము -ఆదితాళము)


ప.    వెనుదీయబోకుమా! వర్జన్యమా!
    కనికరముంచుమ! వర్షాధిదైవతమ!

అ. ప.    పానము చేయుమ! సాగర జలముల
    ఘనమౌ గర్జన చేయగరమ్మా!

1 చ.    ఆకాశమున కెగసి లోకకారణుని
    పోకడి తిరుమేని నలుపు నలదుకొనుమ

2 చ.    విశాల సుందర భుజ పద్మనాభుని  
    అసదృశమగు చక్రమువలె మెరసి
    ఆశనిపాత శంఖముగ గర్జించి
    ఆ శార్జపు శరములుగ వర్షింపుమా

3 చ.    ఆశల, లోకము సుఖముల నొందగ
    మాస మార్గళిని మాకై వర్షింపుమా
వెనుదీయబోకుమా! పర్జన్యమా!

త్రిమూర్తులు ,Trimurtulu



Brahmavishnumaheshwara

ఈ జగత్తంతా మాయకు అధీనమై ఉంటుంది. అందువల్లనే సంసారం సాగరమని తెలిసినా అందులోనే పడి కొట్టుకుంటూ మోక్షం కోసం ఎవరూ ప్రయత్నించరు. ఈ విషయంలో త్రిమూర్తులు కూడా అతీతులు కారు అని అంటుంది దేవీ భాగవతం ఆరోస్కంధం. అయితే కొద్దిగా మనసుపెట్టి ఆలోచిస్తే, మరికొంత కృషి చేస్తే మాయకు లోబడకుండా ఉండే ఉపాయం వివరిస్తోంది. మాయశక్తి మహిమ సామాన్యమైంది కాదు. ఎలాంటి వారైనా దానికి లొంగి పోవాల్సిందే. హిందూమతము సంప్రదాయంలో విస్తృతంగా ఉన్న నమ్మకం ప్రకారము, పురాణాలలో చెప్పిన ప్రకారము త్రిమూర్తులు, అనగా ముగ్గురు దేవుళ్ళు ప్రధాన ఆరాధ్యదైవాలు. వారు

* బ్రహ్మ - సృష్టికర్త
* విష్ణువు - సృష్టి పాలకుదు
* మహేశ్వరుడు - సృష్టి లయ కారకుడు

ఇది స్థూలంగా చెప్పబడే విషయం. ఇక వివరాలకొస్తే వివిధ సంప్రదాయాలను బట్టి, సిద్ధాంతాలను బట్టి, ప్రాంతాలను బట్టి, కాలానుగుణంగా ఆయా దేవుళ్ళకు సంబంధించిన కధలు, నమ్మకాలు, ఆరాధనామార్గాలు మారుతుంటాయి. కాని ప్రధానమైన నమ్మకాలుగా క్రిందివాటిని చెప్పవచ్చును.


* బ్రహ్మ: సృష్టి కర్త. బ్రహ్మ ఉండేది సత్యలోకం. ఆసనం పద్మం. బ్రహ్మ నాలుగు ముఖాలనుండి నాలుగు వేదాలు ఉద్భవించాయి. బ్రహ్మకు పత్ని సరస్వతి చదువుల దేవత. విష్ణువు నాభి లోని పద్మంనుండి బ్రహ్మ జనించాడు గనుక బ్రహ్మకు విష్ణువు జనకుడు.



* విష్ణువు: సృష్టి పాలకుడు. అంటే సృష్టిని నడిపించేవాడు. నివాసం వైకుంఠం. శయనించేది పాలకడలిలో ఆదిశేషునిపైన. పయనించేది గరుత్మంతునిపైన. సంపదల దేవతయైన లక్ష్మీదేవి విష్ణువునకు భార్య. ఆయన ఆయుధములు అయిదు. నారాయణుడు, వాసుదేవుడు వంటి ఎన్నో నామములు. వీటిలో వేయి ప్రధాన నామములు విష్ణు సహస్రనామ స్తోత్రముగా ప్రసిద్ధము. విష్ణువు యుగయుగాన అవతారాలెత్తి లోకంలో ధర్మం నిలుపుతాడు. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వేంకటేశ్వరస్వామి ఇవి ప్రజలు ఎక్కువగా ఆరాధించే అవతారాలు.



* శివుడు: కాలాంతములో సృష్టిని అంతము చేస్తాడు (పునఃసృష్టికి అనుకూలంగా). ఉండేది కైలాసం. వాహనం నంది. త్రినేత్రుడు. తలపై గంగ. మెడలో సర్పము. చర్మాంబరధారి. భక్తసులభుడు. శివుని ఇల్లాలు పార్వతి జగజ్జనని. ఈశ్వరుడు, శంకరుడు, మహాదేవుడు, గంగాధరుడు, నీలకంఠుడు ఇవి ఈయన కొన్ని పేర్లు. వీరంతా ఒకే పరబ్రహ్మముయొక్క వివిధ స్వరూపములనికూడా పలుచోట్ల ప్రస్తావింపబడింది.


విశేషాలు


* ఒక పురాణ కధ ప్రకారం బ్రహ్మకు ఒక శాపం కలిగింది. కనుక బ్రహ్మను పూజించడం అరుదు. కాని త్రిమూర్తులను కలిపి పూజిస్తే దోషం లేదంటారు.
* ఇలా చేసే పూజలలో త్రిమూర్తి వ్రతం ముఖ్యమైనది.

Friday 16 December 2016

కలి అనగా నేమి .కలియుగంలో ఏమి జరుగుతుంది

కలి అనగా నేమి .కలియుగంలో ఏమి జరుగుతుంది

ఒకసారి పాండవులంతా ( ఆ సమయంలోఅక్కడ ధర్మరాజు లేడు) కలసి కృష్ణుని సమీపించి " కలియుగం అంటే ఏమిటి? కలి యుగంలో ఏమి జరుగబోతుంది " అని అడిగారు.

దానికి శ్రీ కృష్ణుడు " నేను చెప్పను, మీరే తెలుసుకోండి అని " చెప్పి నాలుగు బాణాలు తీసుకుని నాలుగు దిక్కుల్లో వదలి, నలుగురిలో ఒక్కొక్కరు ఒక్కోదిక్కు వెళ్లి,తాను  వదిలిన బాణాలను తెమ్మని చెప్పి పంపించాడు..

     అర్జునుడు తూర్పు దిక్కుగా వెళ్లి, అక్కడ పడిన బాణాన్ని తీస్తుండగా మధురమైన స్వరం ఒకటి వినిపించింది.  చూస్తే ఒక చెట్టుకొమ్మపై కోకిల కూర్చుని మధురాతి మదురంగా గానం చేస్తూంది. కానీ అది తన కాళ్ల క్రింద ఎలుకనొకదాన్ని పట్టుకుని తినడానికి సిద్దంగా ఉండడం కూడా చూసి " ఇదేమి వింత..!" అనుకుని వెనుకకు వచ్చేసాడు...

      భీముడు ఉత్తర దిక్కుగా వెళ్లగా, అక్కడ పడిన బాణం పడే చోట ఐదు బావులు కన్పించాయి. వాటిలో ఒకటి చిన్నదిగా ఉండి పూర్తిగా ఎండిపోయి ఉంది.దానీ చుట్టూ ఉన్న నాలుగు
బావులు పూర్తిగా నిండిపొయి చాలదా అన్నట్లు వాటిలో నీరు భయటకు పొర్లుపోతుంది. ఈ సంఘటన చూసిన భీముడు ఏమీ అర్ధంకాక బాణం తీసుకుని తన దారిన తాను వెళ్ళిపోయాడు...

       మూడవ వాడైన నకులుడు పడమట దిశగా వెళ్లి బాణంతో తిరిగి వస్తుండగా దగ్గరలోఒక ఆవు అపుడే జన్మనిచ్చిన దూడను తన నాలుకతో తుడుస్తుండడం చూసాడు. ఆ ఆవు , దూడ శరీరమంతా తుడుస్తూ ఉండగా కొందరు మనుషులు బలవంతంగా అతి కష్టంమీద ఆ ఆవునుండి దూడను వేరుచేయడం జరిగింది. ఈ పెనుగులాటలో దూడ తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన చూసిన నకులుడు మనసులో కొంచెం బాధ పడ్డాడు. చేసేదేమీ లేక వెనుకకు వచ్చేసాడు...

       చివరివాడైన సహదేవుడు దక్షిణ దిశగా పోయి బాణం తీస్తుండగా పక్కనున్న కొండపైనుండి పెద్ద బండరాయి ఒకటి రాళ్లను పిండి చేస్తూ, చెట్లను విరచుకుంటూ వేగంగా దొర్లుతూ రావడం చూసాడు. అది అట్లా దొర్లుకుంటూ పెద్ద పెద్ద వృక్షాలను విరిచేస్తూ చివరికి ఒక చిన్న మొక్క దగ్గరకొచ్చి ఆగిపోయంది. సహదేవునికి మర్మం అర్దంకాక తిరిగివచ్చేసాడు...

      నలుగురు కృష్ణుని వద్దకు వచ్చి తాము చూసిన సంఘటనలను వివరించి వాటియందలి అర్దాన్ని తెలుపవలసిందిగా కోరారు...

      అపుడు కృష్ణుడు మందహాసంతో " కలియుగంనందు మానవులు తాము గొప్ప పండితులమని మాకు సాటి ఎవరూ లేరనే అహంకారంతో కోకిలకూత వలే నీతులు చెపుంట్తారు. కానీ చేసేవి మాత్రం నీచమైన పనులు. వీరు జీవితమంతా అజ్ఞనపు చీకటిలో ఉండి పూజకు పనికి రాని పువ్వు వలే బ్రతకాల్సి వస్తుంది. ఇదే అర్జునుడు చూసిన సంఘటనలోని అర్దం."

        " ఇక రెండవది.. కలియుగంనందు చాలా మంది వద్ద పుష్కలంగా ధనం ఉన్నప్పటికీ వ్యర్థపరమైన ఖర్చులు పెడుతుంటారు తప్ప తమ మద్యనే ఉంటూ కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న తోటి మానవులకు పైసా కూడా ఇవ్వరు. వీరు దనంతో సుఖాలను అనుభవిస్తున్నామనుకుంటుంటారు ..కానీ శవాలతో సహవాసం చేస్తుంటారు. ఇదే భీముడు చూసినదాంట్లోఅంతరార్దం."

          " ఇంకా మూడవది... కలియుగంలోతల్లిదండ్రులు (ఆవు తన దూడ పై చూపించిన అతి ప్రేమ వలే )తమ సంతానంపై మితిమీరిన ప్రేమ చూపిస్తుంటారు. నిజానికి ఈ అతి వలనే వారు చెడు త్రోవ లో పోయి జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారు. వీరివలన సమాజం చైతన్యం కోల్పోతుంది.. నకులుడు చూసిన సంఘటనలో అంతరార్దం."
       " ఇక చివరిగా కలియుగ మానవులు తమ ప్రవర్తన తీరుతెన్నులు సరిగా లేక, జీవిత పరమార్థం, మానవ జన్మ ఆవశ్యకత తెలుసుకోలేక కొండపైనుండి దొర్లి పడిపోయిన బండవలే దారీ తెన్నూ లేక నానా చిక్కుల్లో చిక్కుకుంటూ అశాంతిని అనుభవిస్తుంటారు.ఈ క్రమంలో తోటివారిని కూడా నానా అవస్థలకు గురి చేస్తుంటారు..

 అయితే అలా దొర్లుతూ చివరికి భగవంతుని చెంతకు వచ్చేటప్పటికి అశాంతి అంతా పొేయి పరమ శాంతిని పొందుతుంటాడు. ఇదే సహదేవుడు చూసిన సంఘటనలోని భావం." అని కృష్ణుడు బోదించాడు...

ధర్మరాజు - ‘యుధిష్ఠిరుడు’!

ధర్మరాజు - ‘యుధిష్ఠిరుడు’!

ధర్మరాజుకి యుధిష్టిరుడు అనే బిరుదం ఉంది. అంటే యుద్ధంలో స్థిరంగా నిలబడి పొరాడే వాడు అని అర్ధం. కాని ధర్మరాజు యుద్ధాల్లో వెనుదిరగని వీరుడు అని మనం ఋజువు చేయడం కష్టం.మరైతే ఈ బిరుదు ఆయన విషయంలో ఎలా సార్ధకమవుతుంది?

యుద్ధం అంటే కేవలం శత్రువులతో చేసేది మాత్రమే కాదు. ఆ యుధాలతో చేసేది అంతకన్నా కాదు. ఎవరు శత్రువో తెలియకపొయినా ఏ ఆయుధం దొరకపోయినా మనం మనల్ని జయించడం కోసం చేసే నిత్య జీవల సంగ్రామమే నిజమైన యుద్దం. ఆ యుద్ధంలో ధర్మరాజు నిజంగా వెనుదిరగని వీరుడే. అందుకే ఆయన యుధిష్టిరుడయ్యాడు.

ఆయన జీవన యుధిష్టిరత్వానికి ప్రత్యక్ష నిదర్శనమే ‘యక్ష ప్రశ్నలు’ ఘట్టం. ‘అనువుగాని చోట అధికులమనరాదు’ అని ప్రపంచంలో అన్ని ప్రదేశాలలోను, జీవితంలో అన్ని సందర్భాలలోను మనదేపైచేయి అనుకోకూడదు. వనవాసమ్లో ఉన్న ధర్మరాజుకి, సోదరులకి దాహం అయితే నకులుణ్ణి పిలిచి నీళ్ళు ఎక్కడైనా దొరుకుతాయేమో తీసుకురమ్మన్నాడు. అతను వెళ్ళి ఒక సరోవరం చూశాడు. అందులొ దిగి నీరు త్రాగబోయాడు. అంతలో ఒక యక్షుడు కొంగరూపంలో వచ్చి అడ్డుకుని తన ప్రశ్నలు సమాధానలు చెబితే గాని నీరు త్రాగడానికి వీలులేదన్నాడు. కొంగను అల్ప జీవిగా భావించిన నకులుడు ఆ ఆదేశాన్ని ధిక్కరించి నీరు త్రాగబోయాడు.

యక్షుని క్రోధానికి గురై మరణించాడు. సహదేవుడు, అర్జునుడు, భిముడు కూడా అదే దారిని త్రొక్కి, అదే అహంకారంతో అదే విధంగా మరణించారు. చివరకు ధర్మరాజు వెళ్ళాడు.

సోదరుల శవాలు గమనించి దుఃఖించాడు. చుట్టూ ఉన్న పరిస్థితులు గమనించాడు. ‘ఇది అనువు గాని ప్రదేశం, ఇక్కడ అధికులమనరాదు’ అని నిశ్చయించుకొన్నాడు. కొంగలోని దివ్యత్వాన్ని అవగాహన చేసుకొని ప్రశ్నలకు జవాబులివ్వడానికి సిద్ధపడ్డాడు. జవాబులు చెప్తే ఒక్కరినైనా బ్రతికిస్తుందని కచ్చితంగా చెప్పలేం. అయినా ఆపదలందు ధైర్యగుణము అన్నట్లుగా గుండెలు చిక్కబట్టుకుని తన ప్రయత్నం తాను చేశాడు.

మొత్తం వంద ప్రశ్నలకు పైగా ఉన్నా అన్నింటికీ ఓపికగా తన పరిజ్ఞానం మేరకు సమాధానం చెప్పాడు. అవి ఏ పుస్తకంలోనూ సమాధానాలు దొరకని ప్రశ్నలు. వాటికి ఏ కేంద్రంలోను శిక్షణ ఇవ్వరు. అవగాహనే గ్రంథం. అంతరంగమే శిక్షణా కేంద్రం.

భూమికంటే గొప్పది ఏది? - తల్లి.

ఆకాశం కంటె ఉన్నతుడు ఎవరు? - తండ్రి.

జీవితాంతం తోడుండేది ఎవరు? - గుండె ధైర్యం.

ఇవీ ఆ సమాధానాలు. ఆ సమాధానాలకు సంతోషించిన యక్షుడు చివరగా ఒక ప్రశ్న అడిగాదు. దానికి జవాబు చెబితే సోదరులలో ఒకరిని బ్రతికిస్తానన్నాడు. అక్కడికదే అదృష్టం అని అంగీకరించాడు ధర్మరాజు. చివరి ప్రశ్న చాలా ఆశ్చర్యకరమైనది.

అన్నింటికంటే ఆశ్చర్యకరమైనది ఏది? - ‘రోజు ఎంతో మంది మరణిస్తూ ఉంటె చూస్తూ కూడా మనం శాశ్వతం అనుకొని సంపదలు కూడబెట్టుకొంటున్నామే’ ఇదీ అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం అన్నాడు.

ఆశ్చర్యపోయిన యక్షుడు ధర్మరాజును అతి క్లిష్టమైన పరిస్థితిలోకి నెట్టాడు.

ఇంతకీ నీ సోదరులు నలుగురిలో ఎవరిని బ్రతికించమంటావు అన్నాడు.
ఇంతవరకు సమాచాకానికి పరీక్ష. ఇప్పుదు సంస్కారానికి పరీక్ష.
ధర్మరాజు ఒక్కక్షణం ఆలోచించలేదు.

‘నకుల జీవతు మేభ్రాతా’ నా తమ్ముడు నకులుణ్ణి బ్రతికించండి. అన్నాడు

ఇప్పుడాశ్చర్యపోవడం యక్షుని వంతయింది. అదేమిటయ్యా, అమాయక చక్రవర్తి, భయంకరమైన యుద్ధాన్ని పెట్టుకొని పదివేల ఏనుగుల బలం కలిగిన పార్ధుణ్ణి వదిలి నకులుణ్ణి కోరుకుంటున్నావేమిటి? అన్నాడు.

వెంటనే ధర్మరాజు గెలుపు గుర్రాల రాజకీయం తనకు తెలియదనీ, యక్షుడు నలుగురినీ బ్రతికిస్తే తనకు పరమానందమేననీ కానీ ఒక్కరినే కోరుకోమనడం వల్ల నకులుని కోరుకోవలసి వచ్చిందనీ స్థిరంగా చెప్పాడు.

మా నాన్న్గగారికి కుంతి, మాద్రి అని ఇద్దరు భార్యలు. వారిలో మాద్రి చనిపోతూ తన కుమారులిద్దరినీ మా అమ్మ చేతిలో పెట్టి వెళ్ళీపోయింది. కుంతి సంతానంలో పెద్దవాణ్ణి నేను బ్రతికే ఉన్నాను. మా పినతల్లి సంతానంలో పెద్దవాడు నకులుడు. కాబట్టి అతను బ్రతకాలి. ఇంతకు మించి నాకు రాజకీయ సమీకరణాలు తెలియవు.

నకులిణ్ణి నేను బ్రతికించగల్గితే మా తల్లులిద్దరికీ సమానంగా న్యాయం చేసిన వాణ్ణవుతాను. రేపు మా అమ్మ ఏ సందర్భంలో కూడా మా పినతల్లి ముందు తలవంచుకోవలసిన పరిస్థితి రాదు. మా అమ్మ నావల్ల ఈ లోకంలోనైనా ఏలోకంలోనైనా తలయెత్తుకుని బ్రతకాలి గానీ తలదించుకుని బ్రతకకూడదు. అని ధర్మరాజు నిశ్చయంగా చెప్పేసరికి ఆశ్చర్యపడి, ఆనందించి యక్షుడు భీమార్జున నకుల సహదేవులు నలుగురినీ బ్రతికించాడు.


అంటే ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి మన కర్తవ్యం ఏదో మనం చేస్తే ఆపైన దైవానుగ్రహం సంపూర్ణంగా ఉంటుందన్నమాట.ఇదీ ధర్మరాజుని యుధిష్టిరుని చేసిన యక్ష ప్రశ్నల ఘట్టం.

*ఈవేళ పరీక్షలో నాలుగు జవాబులు ముందుండగా సరైన జవాబు గుర్తించడానికి ఒత్తిడికి లోనై ఆందోళనకు గురై, విజయం సాధించలేక ఆత్మహత్యలకు సహితం సిద్ధపడుతున్న మన యువతరం యక్ష ప్రశ్నలు చదివితీరాలి. ధర్మరాజు ముందు నాలుగు సమాధానాలు లేవు. నలుగురు తమ్ముళ్ళ శవాలున్నాయి. అయినా తట్టుకుని నిలబడి అన్నింటికీ సమాధానాలు చెప్పి సమాచారంలోను, సదాచారంలోనూ కూడా తనకు సాటిలేరని నిరూపీంచుకున్న జీవన యుధిష్టిరుడు, అదర్శ నాయకుడు ధర్మరాజు.*

అయ్యప్ప జన్మ రహాస్యమ్

నమస్కారం,


 నేను అయ్యప్ప స్వామి గురించి పూర్వం తెచ్చిన ప్రస్తావనకి అనుభంధముగా పూర్వము చెప్పిన విధంగా అయ్యప్ప స్వామి గురించి కొన్ని పరిశీలనగా చూసిన కొన్ని ప్రశ్నాత్మక సందేహాలను మీ ముందు ఉంచుతున్నాను.. 



ఇది వివాదాస్పదంగా కాకుండా కేవలం సత్యము గూర్చి పరిశీలనాత్మకంగానే చూసి, సందేహాలకు స్పందించవలసిందిగా మనవి . 


1) అయ్యప్ప స్వామి జననంకి ముఖ్య కారణం నుంచి మొదలు పెడదాము,
అయప్ప స్వామి జననానికి ముఖ్య కారణం మహిషి అనే రాక్షసి సంహారం కోసమని హరి హరులకు పుట్టిన సంతానం వలన మాత్రమే మరణం సంభవముగా బ్రహ్మ వరము పొందినది అని అన్నారు.
ఆ మహిషి ఎవరు అనేది కూడా చెప్పారు, మహిషాసురుడు అనే రాక్షసుడుకి చెల్లెలు అని, మహిషాసురుడు మరణానికి దేవతల పైన పగ తీర్చుకోవడం కోసమని తపస్సు చేసి వరము పొందినది అని అంటారు.. అసలు ఇక్కడ ఒక విషయం గమనించాలి అందరూ... మహిషాసురుడుని పార్వతీ దేవి కృత యుగములో సంహరించినది... ఆ మహిషాసురుడు కి చెల్లెలు అయిన మహిషి కూడా కృత యుగం నాటిదే, మరి ఆ మహిషిని సంహరించడానికి అయ్యప్ప కృత యుగములో కోట్ల యేళ్ళు ఆగి, త్రేతా యుగంలో కోట్ల సంవత్సరాలు ఆగి, ద్వాపర యుగంలో లక్షల సంవత్సరాలు ఆగి, కలియుగంలో 3వేల సంవత్సరాలు పైగానే ఆగి ఎందుకు అవతరించి మహిషిని సంహరించాడు?

2) కొంత మంది మహిషి ఆ యుగం నుంచే తపస్సు చేస్తూనే ఉంది అంటారు, అది సాధ్యము కానిది, ఎవరు అయినా తపస్సు ఉచ్చ స్థాయికి చేరుకునప్పుడు దేవతలు తప్పక ప్రత్యక్షం అవుతారు, లేకుంటే  వారి తపస్సు తీవ్రత వలన లోకాలు కంపిస్తాయి, అది జరుగక ముందే దేవతలు వచ్చి వరం ప్రసాదిస్తారు,. అంటే కృత యుగం నాటికే మహిషి వారం పొంది ఉండాలి & అప్పటి నుంచే ఇంద్ర పదవి ఆక్రమించి ఉండాలి... మరి ఎక్కడ? ఏ పురాణ వాగ్మయంలో కానీ సంభంధిత గ్రంధాలలో కానీ మహిషి ఇంద్ర పదవి ఆక్రమించిన ప్రస్తావన ఎందుకు ఎక్కడా లేదు? అంత ఇంద్ర పదవి ఆక్రమిస్తే మరి ఎందుకు ఎందులోనూ ప్రస్తావించలేదు?

3) అసలు మహిషి గురించే ఎక్కడా ఎందుకు లేదు? మహిషి అనే రాక్షసి గురించి కానీ తపస్సు గురించి కానీ వరం గురించి కానీ లేక ఇతర ఏ ఒక్క విషయం అయినా కానీ ఎందుకు ఏ పురాణ గ్రంధంలో ప్రస్తావించలేదు?

4) ఇప్పుడు అయ్యప్ప స్వామి గురించి చూస్తే, అంతటి హరి హర పుత్రుడు అయిన అయ్యప్ప స్వామి జననం గురించి కానీ లేక జీవితం గురించి కానీ ఎందుకు ఎక్కడా ఏ పురానా ఇతిహాసాదులలో ప్రస్తావించలేదు?  కొంత మంది అసలు చదవకా స్కాంద పురాణంలో ఉంది అంటారు, కొంత మంది వరాహ పురాణంలో ఉంది అంటారు.. నేను రెండిటిలోనూ చూశాను.. ఎక్కడా లేదు... చాలా మంది దేవతల గురించి యక్ష కిన్నెర కింపురుషాదుల గురించి చెప్పిన పురాణాలు అంతటి హరి హర పుత్రుడు ఆయప్ప స్వామి గురించి ఎందుకు చెప్పలేక పోయాయి?

5) కొంత మంది అయ్యప్ప స్వామి కలియుగం వాడు అందుకనే ద్వాపర యుగములో వాడైన వేద వ్యాసుడు అయప్ప గురించి పురాణ ప్రస్తావన చేయలేకపోయాడు అనే అవకాశం ఎంత మాత్రం లేదు, ఎందుకంటే కలియుగంలో జరిగే అనేక విషయముల గురించి వ్యాసుల వారు భవిష్యత్ పురాణంలో చెప్పి ఉన్నారు,. మరి అందులో అయినా అంతటి హరి హరులకు పుట్టిన అయప్ప స్వామి గురించి ఎందుకు చెప్పలేదు? పోనీ వ్యాసుల వారు చిరంజీవియే కదా, ఆది శంకరాచార్యుల వారికి దర్శనం ఇచ్చి బ్రహ్మ సూత్ర భాష్యం గూర్చి చర్చించిన ఆయన మరి అయప్ప గురించి ఎందుకు రాయలేకపోయారు ఎందుకు రాయించలేకపోయారు?

6) అసలు అయ్యప్ప స్వామి మోహినీ పుత్రుడు ఎప్పుడు అయ్యాడు? మహా విష్ణువు మోహినీ రూపము కేవలం రెండు సార్లే తీసుకున్నాడు, మొదటిది భస్మాసుర సంహారం, రెండవది క్షీర సాగర మధనం అను రెండు సంధార్భాలలో మాత్రమే తీసుకున్నాడు, అప్పుడు ఎక్కడా శివుడు మోహినిని చూసి మోహించడము కానీ అయప్ప పుట్టుక గురించి కానీ ఎక్కడా లేదే? మరి మోహినీ పుత్రుడు ఎలా అయ్యాడు?

7) అయప్ప స్వామి విగ్రహం పరశురామ ప్రతిష్టితం అన్నారు, అది కూడా సాధ్యము కానిదే, పరశురాముడు కేవలం శివ భక్తుడు, ఆయన శివుడునే పూజిస్తాడు, అంతటి పరశురాముడు ప్రతిష్ట చేస్తే కేవలం శివలింగ ప్రతిష్ట మాత్రమే చేస్తాడు, అందుకే మనము చాలా చోట్ల పరశురామ ప్రతిష్టిత శివలింగము చూస్తాము.. ఇకపోతే శివలింగ ప్రతిష్ట ఎందుకు అంటే, ఒక మనిషిని హతమార్చిన పాపం శివలింగ ప్రతిష్ట ద్వారా పోతుంది, అందుకనే పూర్వం రాజులు అనేక గుడులలో అనేక శివ లింగ ప్రతిష్టలు చేసే వారు.. పరశురాముడు అధర్మముతో ఉన్న క్షత్రియులను సంహరించడం చేత, మనిషిని చంపిన పాపం పోవడానికి శివ లింగ ప్రతిష్టలు చేశాడు,. ఆయన వేరొక దేవుడుని అసలు కొలువరు వేరొక దేవుడు విగ్రహ ప్రతిష్ట చేయరు.. అలా ఆయన అయప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట చేసినట్టుగా కూడా ఎటువంటి ప్రామాణికం లేదు..

8) అయప్ప స్వామి దీక్ష గురించి చూస్తే శనైశ్చరుడుకి వరము ఇచ్చి ఇటువంటి నియమములు పెట్టినట్టు ఉన్నది,. అది కూడా ఎక్కడా ప్రామాణికత లేదు, పైపెచ్చు.. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే.. శనైశ్చరుడు ఆయన ధర్మము ప్రకారము జాతక చక్రములో తాను ఉన్న కాలములో కొన్ని సార్లు చెడు ప్రభావము చూపిస్తాడు కొన్ని సార్లు మంచి చేస్తాడు,. అది ఆయన ధర్మం.. అది కూడా మన మంచి కొరకే ఆయన అలా నిర్వర్తిస్తాడు... కేవలం ఆయన జాతక చక్రంలో ఎవరికి అయితే ఆ కాలములో ఉంటాడో వారి మీద మాత్రమే శని ప్రభావము ఉంటుంది,. మరి అలాంటప్పుడు ఆ జాతక పరిస్తితి  లేని మిగతా అందరినీ కూడా అలానే శని ప్రభావము నుంచి తప్పించే విషంగా బట్టలు కట్టుకోవడం నుంచి ప్రతి నియమం పాటించమని ఎందుకు చెప్పాడు అయ్యప్ప? జాతకము గూర్చి అయప్ప స్వామికి తెలియదా? అసలు పైనవి చూస్తే అయ్యప్ప స్వామి అవతరించడమే ప్రశ్నార్ధకంగా ఉన్నది.

9) నవవిధ భక్తి రీతులలో చిట్ట చివరిది “శరణాగతి” అంటే శరణు వేడడం.. ముందు రీతులు ఏవి కానప్పుడు చిట్ట చివరిది అయిన శరణాగతిని ఆశ్రయిస్తారు.. అసలు అయప్ప స్వామిని భక్తులు ఊరక ముందే శరణం శరణం అని ఎలా అనేస్తున్నారు? ఆ “ శరణం “ అనే పదానికి ఎంత అర్ధం ఉన్నది? ఎప్పుడు పడితే అప్పుడు భగవంతుడుని శరణు వేడుతారా? శరణాగతికి అసలు అర్ధమే మార్చేస్తున్నారే? అసలు ఎందుకు శరణు వెడుతున్నారు పదే పదే? వారి జీవితము మరియు అన్నీ వారి చేతుల్లో ఇక ఏమి లేక దిక్కు తోచక చేసే శరణాగతి స్థితిలో వారు ఎవరైనా ఉన్నారా అసలు?? వేరే ఏ దేవుడుకి ముందుగానే శరణాగతి చేయవలసిందే అనే నియమం వేరే ఏ దేవుడుకి లేనిది ఎందుకు అయ్యప్పకే ఉన్నది? అయప్ప శరణాగతి చేస్తే కానీ పలకడా? అదొక్కటే మార్గమా అయ్యప్ప విషయంలో? అసలు వారి ఉద్ధేశంలో అలా పదే పదే పలికే శరణాగతికి వివరం ఏమిటి?

10) అయ్యప్ప స్వామి పూజ గురించి చూస్తే,. అసలు ఉపనయన సంస్కారము జరగనిదే ఎవరికీ గాయత్రి మంత్రము ఉచ్చరించే స్మరించే అర్హత లేదు, సంకల్పము పలికి పూజలు చేసే అర్హత లేదు.. భగవంతుడుకే తప్పదు ఈ నియమం.. వినాయకుడు అంతటి వాడే ఉపనయనం చేసుకొనక తప్పలేదు.. మరి అయ్యప్ప స్వామి భక్తులు ఏ అర్హత పొంది అలా పూజలు చేసేస్తున్నారు? ఉపనయనము అయినదా? గాయాత్రి మంత్రోపదేశము జరిగినదా ? మరి ఎవరు పడితే వాళ్ళు పూర్తి శాస్త్ర విరుద్ధంగా అలా గాయత్రి పలుకుతూ అయప్ప పూజ ఎలా చేస్తున్నారు? ఏ మంత్రము అయినా ఉపదేశము లేనిదే చదివితే అది పెద్ద దోషము.. మరి శాస్త్ర విరుద్ధంగా అలా ఎలా ఉపదేశం లేకుండా గాయత్రి మంత్రము చదువుతూ, సంకల్పము చెప్పి ఎవరు పడితే వాళ్ళు పూజలు అలా ఎలా చేసేస్తున్నారు?


పైన అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కేవలం భావాత్మకముగా కాక సత్యములేని “మా నమ్మకం మాది” అనే మూఢ నమ్మకముతో కాక ప్రామాణీకముగా సందేహాల నివృత్తి చేయగలరని ప్రార్ధన..

ఇది వివాదాస్పదంగా కాకుండా కేవలం సత్యము గూర్చి పరిశీలనాత్మకంగానే చూసి, సందేహాలకు ప్రామాణికంగా  స్పందించవలసిందిగా మనవి .

శ్రీ రామ చంద్రపరబ్రహ్మణే నమః 🙏🏻🙏🏻
శ్రీ గురుభ్యో నమః 🙏🏻🙏🏻🙏🏻

 Source: internet

Thursday 15 December 2016

భార్య - భర్తలు ఎలా వుండాలి ?

భార్య - భర్తలు ఎలా వుండాలి ?


పార్వతీ - పరమేశ్వరుల వలె, లక్ష్మీనారాయణుల వలె
సీతా రామచంద్రుల వలె

 కలసి మెలసి వుండవలె!!

 " వాగర్ధావివ  సంపృక్తౌ  వాగర్ధ ప్రతిపత్తయే
 జగతః పితరౌ వందే పార్వతీ (ప)  రమేశ్వరౌ!
                                  ---  మహాకవి కాళిదాసు

భావము:-  వాక్కు నుండి అర్థమును వేరు
చేయలేము కదా !  వాక్కు అర్థము ల వలె
కలసి వుండే పార్వతీ పరమేశ్వరులకు మరియు రమేశ్వరులు అంటే లక్ష్మీనారాయణు
లకు వందనములు !!

భర్త ద్వారా సంతానవతి  అయిన స్త్రీ మాత్రమే పరిపూర్ణురాలవుతుంది !!

మరి మగవాడు పరిపూర్ణుడు ఎప్పుడు అవుతాడు?

ఈ విషయం గురించి వేదాలలో ఏమున్నదో గమనించండి!!

శుక్ల యజుర్వేదం లోని “శథపథ బ్రాహ్మణం” లోని క్రింది మంత్రాన్ని చూడండి!!

" అర్ధో హ వాయేష ఆత్మనో యజ్ఞాయా, తస్మాద్యావజ్జాయాం
న విందయతేనైవ తావత్ ప్రజాయతే అసర్వోహి తావద్భవతి
అథ యదైవ జాయాత్ విందతే అథ ప్రజాయతే, తర్హిసి సర్వో భవతి!
సర్వ ఏతాం గతిం గచ్ఛానీతి " (5.2.1.10)

అర్థం :
భార్య భర్తలో సగభాగం. ఆమెను పొందేవరకు అతను సంతానాన్ని కనలేడు. అసంపూర్ణుడే అవుతాడు. భార్యను, ఆమె ద్వారా సంతానాన్ని పొందిన భర్త పరిపూర్ణత సాధిస్తాడు.

కాబట్టి పై వేదప్రమాణం ప్రకారం పురుషుడు కూడా సంతానం పొందితేనే పరిపూర్ణ పురుషుడు కాగలడని తెలుస్తోంది.

* మనం ఇంకో విషయం గమనిస్తే కనుక ఒకటి అర్థం అవుతుంది.!!
 పై శ్లోకంలో భార్య ద్వారా సంతానం పొందేవాడు మాత్రమే పరిపూర్ణతను పొందుతాడని చెప్పబడింది!!

 అంటే కట్టుకొన్న భార్య ద్వారానే పొందాలి, ఇతరత్రా కాదు అన్న విషయం స్పష్టమవుతోంది!!

ఆది దంపతుల వలె ఆదర్శ దాంపత్య
జీవితాన్ని సాధించి ఆదర్శ హిందూ కుటుంబ
జీవనాన్ని అలవరచుకుందాము !!

శుభమ్ భూయాత్

Friday 2 December 2016

నమ్మక ద్రోహం... హా.. హా.. హా!!


*ఫన్‌టాస్టిక్*

ఏది నకిలీ? ఏది అసలు? ఈ మాయా ప్రపంచంలో కనిపెట్టడం కష్టమే! ప్రతి ఒరిజినల్‌కీ ఒక ఫేక్ పుట్టుకొచ్చేస్తోంది. సృష్టిలో లేనివి మనుషుల మధ్యకు వచ్చి సంచరిస్తున్నాయి. చరిత్రలో లేనివి వర్తమానంలోని పుటలకు ఎక్కేస్తున్నాయి. ఎక్కడా జరగనివి, ఎక్కడో జరిగినట్లుగా, ఎప్పుడో జరిగినట్లుగా ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. అలాంటి అందమైన, అద్భుతమైన అబద్ధాలు మీ కోసం...

*నల్ల సింహం*

వావ్! ప్రకృతి ఎంత వైవిధ్యభరితమైనది?!*
గుడ్డేం కాదూ. ఈ పక్కన ఉన్న తెల్లసింహానికి కాపీ ఈ నల్ల సింహం. ఫొటోషాప్‌లో వైట్‌ని బ్లాక్ చేశారు. ఓపిగ్గా!

*అబ్రహాం లింకన్*

ఎప్పటి నుంచి చూస్తున్నాం సార్ ఫొటో! అమెరికన్ ప్రెసిడెంటే కదా. ఓ మై దేవుడా! ఈయన ఆయన కాదని అనబోతున్నారా ఏంటి? ఆయనే! కానీ తలకాయ ఒక్కటే లింకన్‌ది. మిగతా బాడీ అంతా జాన్ సి.కాల్‌హౌస్ అనే పొలిటీషియన్‌ది. ఫొటోషాప్ రాక ముందే ఈ తలనరికే టెక్నాలజీ వచ్చేసినట్లుంది.

*లేడీ డయానా!*

ఎంత డీసెంట్ ఉమెన్. ఇలా చేస్తుందేమిటీ... ఇండీసెంట్‌గా!
ఇండీసెంట్ పాపం డయానా కాదు. డయానాలా ఉండే మహిళతో ఇలా వేలు చూపించి ఫొటో తీసినవాడు.

*బేబీ బంటి*

ఎంత ముద్దుగా ఉంది! హగ్ చేసుకోవాలనిపిస్తోంది.
బేబీ పోలార్ బేర్‌లు ఇంత బుజ్జిగా ఉంటాయా!
ఉండవు. ఇక్కడ బజ్జున్న బాలబంటిలా ఉంటాయి

*చైనా ట్రాఫిక్*

చైనాలో ఇంత ట్రాఫిక్కా! ఫొటో తీసినవాడికి దండాలు.
ఫొటో తీసినవాడిక్కాదు, ఫొటోషాపులో చేసిన వాడికి పెట్టండి మీ దండాలు. అది నకిలీ. ఇది రియల్.

*మార్లిన్ మన్రో*

మన్రో వెనుక ఉన్నది జాన్ ఎఫ్.కెన్నెడీనే కదా! నో డౌట్. ఆమె నడుము చుట్టూ ఆయన చేతులు. ఆమె తలవంపులో ఆయన తమకాలు! అంత రహస్యమైన ప్రేమ ఇలా ఎలా బయటికి పొక్కిందబ్బా!!

పొక్కడం కాదు, పొంగడం కాదు. అసలు వీళ్లిద్దరూ వాళ్లు కానే కాదు. ఆలిసన్ జాక్సన్  అనే ఓ బ్రిటిష్ ఫొటోగ్రాఫర్‌కి ప్రముఖుల పోలికలున్న వాళ్లను పనిగట్టుకుని మరీ ఫోటోలు తీయడం అలవాటు. అలా తీసిన ఫోటోనే ఇది.

ప్రపంచపు చివరి యోధుడు ఫిడెల్ కాస్ట్రో కన్నుమూత

ప్రపంచపు చివరి యోధుడు ఫిడెల్ కాస్ట్రో కన్నుమూత                                                            #ఉజ్వలమైన కన్నీళ్లే మా నివాళి                                                   ఫిడెల్ కాస్ట్రో.. క్యూబా కొద‌మ సింహం.. సామ్రాజ్య‌వాదుల పాలిట సింహ స్వ‌ప్నం.. అమెరికాకు కంట్లో న‌ల‌క ప‌డితే.. అనేక దేశాలకు కంట్లో నీళ్లు వ‌చ్చే ప‌రిస్థితులు ఉన్నాయి. ప్ర‌పంచీక‌ర‌ణ నేప‌థ్యంలో ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా అమెరికా ప్ర‌పంచ దేశాల‌ను త‌న మీద ఆధార‌ప‌డి బ‌తికేలా చేసుకుంది. ఒకే ఒక్క దేశం.. 50 ఏళ్ల‌కు పైగా అమెరికా ఆర్థిక అంక్ష‌లు త‌ట్టుకుని అగ్ర‌గామిగా నిల‌బ‌డింది. సేంద్రీయ వ్య‌వ‌సాయంతో పాటు పేద‌రికం, యాచ‌కులు లేకుండా ప్ర‌తీ పౌరుడి  ఆరోగ్య సంర‌క్ష‌ణ బాధ్య‌త‌లు  ప్ర‌భుత్వ‌మే చూస్తోంది. వంద‌శాతం అక్ష‌రాస్య‌త‌తో పాటు నిరుద్యోగులు ఒక శాతం లేకుండా చూస్తున్నారు. ప్ర‌పంచంలో అత్యంత నాణ్య‌మైన వైద్య సేవ‌లు అందుతున్న దేశంగా క్యూబా అమెరికాను మించి పోయింది. అమెరికాకు కూత‌వేటు దూరంలో ఉన్న బుల్లి క్యూబా దేశం లాటిన్ అమెరికా దేశాల‌కు వేగు చుక్క‌గా మారింది. ఫెడ‌ల్ కాస్ట్రో, చేగోవేరా విప్ల‌వ స్ఫూర్తి ప్ర‌పంచానికి ఆద‌ర్శంగా మారింది. వారు క‌ల‌లు గ‌న్న మ‌రో ప్ర‌పంచాన్ని క్యూబా ఆవిష్క‌రించింది. నియంత‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేసి క్యూబాకు స్వేచ్ఛ‌ను ప్ర‌సాదించ‌డ‌మే కాకుండా ప్రపంచానికి ఒక దిక్సూచిగా మార్చిన ఫెడ‌ల్ కాస్ట్రో 20 వ శ‌త‌బ్ధాపు చివ‌రి యోధుడు. విప్ల‌వ చ‌రిత్ర‌పై చెర‌గ‌ని సంత‌కం చేశాడు. వ‌య‌సు మీద ప‌డినా  త‌న పోరాట స్ఫూర్తి, ప్ర‌జ‌ల‌ను ప్రేమించే గుణం.. చివరి వరుకు వ‌ద‌ల్లేదు. ప్ర‌పంచంలో ఎక్కువ సార్లు హ్య‌త్యా ప్ర‌య‌త్నాలు జ‌రిగిన నేత‌గా ప్ర‌సిద్ధి కెక్కారు. ఒక‌టి కాదు రెండు కాదు..  ఏకంగా 633 సార్లుకు పైగా ఫిడె‌ల్ కాస్ట్రోపై హత్యా ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. అన్నిసార్లు అత‌ను మృత్యుంజ‌యుడులా బ‌య‌ట‌ప‌డ్డారు. మ‌న కాలపు చివ‌రి యోధుడైన ఫెడ‌ల్ కాస్ట్రో భూగోళంతో తెగతెంపులు చేసుకొని సమస్త మానవాళిని వదిలి వెళ్లిపోవడం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
The end of an era.
But revolutionaries like *COMRADE FIDEL CASTRO* lives for ever.

పంచతంత్ర కధలు -27

పెద్దలకు కూడా ఉపయోగపడే పంచతంత్ర కధలు -27.

ఆశకు అంతులేకపోతే..

నలుగురు యువకులు ఒకవూరిలో యెంతో స్నేహంగా వుండేవారు.  వారివారి వృత్తులలో  నైపుణ్యంకలిగి మంచిపేరు తెచ్చుకున్నారు, ఆ వూరిలో.   అయితే, తమ నైపుణ్యానికి తగిన గుర్తింపురాలేదనీ,  తమకు ధనంవిషయంలో అనుకున్న సంపాదనలేదని యెప్పుడూ అసంతృప్తితో వుండేవారు.  అట్టి సందర్భాలలో, వున్నవూరుని, కన్నవాళ్ళనీ,  వదిలి వెళ్లాలని అనుకొవడం సహజమేకదా ! ఆ వూరు తమ విద్యకు తగినప్రదేశం కాదని, వేరే పెద్దనగరానికి వెళ్ళ్లాలని తలపోసి, బయలుదేరారు.  ఉజ్జయినీనగరం చేరుకున్నారు.

సిప్రానదిలో స్నానంచేసి, మహాకాళేశ్వరుని దర్శించుకున్నారు.  అక్కడ భైరవానంద స్వామి వీరిని పలుకరించి యోగక్షేమాలు కనుక్కున్నారు.  స్వామితో సంభాషిస్తున్నప్పుడు, '  మేము మాఅభివృధ్ధికోసం బయలుదేరాము. ఈ అన్వేషణలో మాకు విజయమో, వీరస్వర్గమో అనిసంకల్పించి వచ్చాము.  సాహసించినందుకు  మాకు ఫలితం  దక్కుతుందనే అనుకుంటున్నాము. ' అన్నారు .   కొద్దిసేపు వారితో మాట్లాడిన తరువాత, వారి దృఢమైన సంకల్పానికి, సంభాషణా ధోరణికి స్వామి యెంతో సంతోషించి, వారు నలుగురికీ, ఒక్కొక్కరిచేతిలో, ఒకగుళికను వుంచి, హిమాలయాల వైపు ప్రయాణం సాగించామని చెప్పారు.  '  ఎక్కడైతే, మీ చేతిలోనుండి గుళిక జారి క్రిందపడుతుందో, అక్కడ సంపదకై వెదకండి.  మీకు శుభంకలుగుతుంది. ' అని ఆశీర్వదించి పంపించారు.

కొంతదూరం వెళ్ళగానే, మొదటివాని చేతిలో గుళిక జారిపడింది.  అక్కడ కొంత లోతుకు త్రవ్వగానే, చాలా పెద్ద పరిమాణం లో  ' రాగి ఖనిజం ' కంటబడింది.    మిగిలిన ముగ్గురితో మొదటివాడు,  ' మీరు ముగ్గురూ కూడా కావలసినంత రాగి తీసుకువెళ్ళండి.  ఇక అందరమూ వెనుకకువెల్దాము. '   అన్నాడు..  వారు దానికి వప్పుకోక, ' రాగిలో యేముంది ! ఇంకా ముందుకు వెళదాం. ' అని వారు బయలుదేరారు. మొదటివాడు మాత్రం తాను తీసుకువెళ్లగలిగినంత రాగితో వెనుకకుమరలాడు.

ఇంకొద్దిదూరం వెళ్ళగానే, రెండవవాని చేతిలో గుళిక క్రిందపడింది.  అక్కడ త్రవ్వి చూడగా, వెండిఖనిజం బయటపడింది.  రెండవవాడు సంతోషంగా కావలసినంత వెండి పోగుచేసుకుని వెనుకకు మరలుతూ, మిగిలిన యిద్దరినీ వెండితీసుకుని తనతో వెనుకకు రమ్మన్నాడు.  వాళ్ళు ' ససేమిరా ' అని యింకాముందుకు బయలుదేరాడు.

ఇంకా కొద్దిదూరం మిగిలిన యిద్దరూ వెళ్తూవుండగా, మూడవవాని, నాలుగవ వాని చేతులలో   గుళికలు క్రిందపడి, త్రవ్వగా బంగారంరాసులు కనిపించాయి.  మూడవవాడు, తాను బంగారం పోగుచేసుకుని, నాలుగవ వానిని కూడా తీసుకోమనిచెప్పగా, '  నా గుళిక పొరబాటున క్రింద పడినట్లున్నది.   నాకింకా యేదో పెద్దదే,రాసిపెట్టి వున్నది.  నేను ముందుకువెళ్తాను ' అన్నాడు. 

ఆ విధంగా చాలాదూరం కొండపై యెగబ్రాకగా  , నాలుగవవాడు దారితప్పి, ఎటో వెళ్ళసాగాడు.  ఆకలిదప్పులు, తెలిసివచ్చి, అటూయిటూ బిత్తరచూపులు చూడసాగాడు. వెనుకకు బంగారం దగ్గరకు వెల్దామంటే, దారి కనుక్కోలేకపోయాడు.  ఇంతలో,  ఒళ్ళు రక్తం కారుతూ, తలమీద ఇనుపగుండుమోస్తూ, ఒక వ్యక్తి వేదనపడుతూ కనిపించాడు.

' ఎవరు మీరు ? యిక్కడ యిలా యెందుకు వున్నారు ? ' అని నాలుగవవాడు అడిగిన తక్షణం, యెదుటివ్యక్తి తలపైన వున్న యినుపగుండు, ఇతనితలపైకి వచ్చి,   వేదనపడ సాగాడు.  అవతల వ్యక్తి గాయాలు మానిపోయి, హాయిగా నవ్వుతున్నాడు. 

నాలుగువాడు ' ఏమిటి ఇదంతా ?  మీ తలపై గుండు నాపైకి ఎందుకు వచ్చింది ? నేను యెప్పటిదాకా యిదిమోయాలి.  అయ్యో భగవంతుడా !  నా దురాశ ఎంతపనిచేయించిందీ ! ' అని వాపోయాడు.   దానికి ఎదుటి వ్యక్తి, '  నీ తలపై యిది యెంతకాలం వుండాలి అనేదానిపై, నాకూ అవగాహనలేదు.  అయితే, నీలాగే, మరియొకడు ఎవరైనా వచ్చి, నిన్ను పలకరిస్తేచాలు, నీకష్టాలు గట్టెక్కుతాయి. నీవు, చదువుకున్నవాడవే అనుకుంటున్నాను గానీ, దురాశతో నాలాగా  చిక్కుల్లోపడ్డావు. '  అని సమాధానం యిచ్చి కొండ క్రిందకు వడివడిగా వెళ్ళిపోయాడు.

నాలుగవవాడు,  ఆశగా  యింకెవరైనా తనను యీబంధంనుంచి తప్పించడానికి,  తనలాగా  రాకపోతాడా అని యెదురుచూస్తూనే వున్నాడు.  మూడవవాడు, కొండపైకి తన స్నేహితుని గురించి వెదుకుతూ వస్తుండగా,  క్రిందకు దిగుతున్న వ్యక్తి, విషయం చెప్పి, వెనుకకు మరల్చాడు మూడవవానిని.

చూశారా !  అత్యాశ యెంత అనర్ధాన్ని తెచ్చి పెడుతుందో !  

సత్యభామ యుద్ధం -- మన దీపావళి


     యుద్ధభూమిలో గరుత్మంతుడిపై శ్రీహరి సహితంగా  నిలచిన సత్యభామ ఒక్క సారి వీరావేశం తో యుద్ధానికి పూనుకున్నది.  “ వేణిమ్ జోల్లెము వెట్టి సంఘటిత నీవీబంధయై భూషణ శ్రేణిన్ దాల్చి ‘  వడి వడిగా వాలు జాడ వేసుకున్నది. చీరముడి బిగించింది. భూషణాలను సారి చేసుకున్నది. పైట బిగించింది. ముఖ చంద్రుడు కాంతు లీనుతుండగా తన కాంతుడైన శ్రీ హరి ముందు నిలిచిందట ఆ లేడి కన్నుల వన్నెలాడి. శ్రీ హరి సత్య సంరంభం చూసి  నవ్వుతూ ఇలా అన్నాడు.
“ లేమా దనుజుల గెలువగ
   లేమా నీ వేల కడగి లేచితి విటు రా
   లేమా ను మానవేనిన్
   లేమా విల్లంది కొనుము లీలన్ కేలన్ ´
    “ లేమా ! రాక్షసులను గెలువగా లేమా! నీవేందుకు యుద్ధానికి సిద్ధపడ్డావు ఇలా రా! యుద్ధ ప్రయత్నం మాను ! మాన దలచుకోకపోతే విలాసంగా ఇదిగో ఈ విల్లు అందుకో ! “అన్నాడు శ్రీహరి నవ్వుతూ.
    హరిణాక్షి కి హరి ఇచ్చెను
    సుర నికరోల్లాసనమును శూర కఠోరా
    సుర సైన్య త్రాసనమును
    బల గర్వ నిరాసనమును బాణాసనమున్
       సత్యభామ హరినుండి విల్లు అందుకొని గొప్ప తేజస్సుని పొందింది. ధనుష్టంకారం చేసింది.
 
“ సౌవర్ణ కంకణ  ఝుణ ఝుణ నినదంబు శింజినీ రవంబు తో జెలిమి సేయ
దాటంక మణిగణ ధగ ధగ దీప్తులు గండ మండల రుచి గప్పి కొనగ
ధవళ తరాపాంగ ధళ ధళ రోచులు బాణ జాల ప్ర భాపటలి నడప
శరఘాత ఘమ ఘమ శబ్దంబు పరిపంధి సైనిక కల కల స్వనంబు నుడుప

వీర శృంగార భయ రౌద్ర విస్మయములు , కలసి భామిని యయ్యెనో కాక యనగ
నిషువు దొడగుట దివుచుట యెయు టెల్ల నెరుగ రాకుండనాని సేసె నిందు వదన “
     బంగారు కంకణాల ఝుణ ఝుణ ధ్వనులు వింటి నారి తో కలిసి పోగా , చెవి కమ్మలకు పొదిగిన  మణుల ధగ ధగ కాంతులు చెక్కిళ్ళ కాంతులపై వ్యాపింపగా , అందమైన క్రీగంటి చూపుల ధళ ధళ కాంతులు బాణాల కాంతులని కప్పివేయగా , శరము లను ప్రయోగించుట వలన కలిగిన ఘమ ఘమ శబ్దం శత్రు సైన్యాల కల కల ధ్వనులను అణిచి వేయగా సత్యభామ యుద్ధం చేస్తున్నది. వీరం శృంగారం భయం రౌద్రం విస్మయం అనే భావాలన్నీ కలిసి ఈ భామగా రూపొందాయా అన్నట్లుగా సత్యభామ బాణం తొడగడం లాగడం ప్రయోగించడం కూడా గుర్తించ లేనంత వేగం గా యుద్ధం చేయ సాగింది.
     ఓర కంట హరి ని చూస్తూ, శృంగారం కురిపిస్తూ, తన యుద్ధకౌశలాన్నిచూపుతున్నది మరో కంట వీర రసాన్ని కురిపిస్తున్నది. ఏక కాలం లో రెండు కురిపిస్తున్నది.
పరు జూచున్ వరు జూచు నొంప నలరింపన్, రోష రాగోదయా
విరాట భ్రూకుటి మందహాసముతో వీరంబు శృంగారమున్
జరగన్, కన్నుల కెంపు సొంపు బరగం జండాస్త్ర సందోహమున్
సరసాలోక సమూహమున్ నెరపుచున్ చంద్రాస్య హేలా గతిన్.
     ఏక కాలం లో రెండు రసాలను రెండు కళ్ళతో సత్యభామ ప్రదర్శిస్తున్నది. ఓరకంట నాధుడి పై మందహాస శృంగార విలాస దృక్కులతో వీక్షిస్తూ పరవశింప చేస్తున్నది. తన పరాక్రమాన్ని వయ్యారంగా హరికి చూపి హరి ని సమ్మోహితుడుని చేస్తున్నది. మరో కంట రోషముతో కెంపుల కన్నులతో వీర రసావిష్కరణం చేస్తున్నది.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles