Showing posts with label Quotes. Show all posts
Showing posts with label Quotes. Show all posts

Tuesday 1 December 2015

భోజన వేళలో శుభాశుభ శకునాలు

భోజన వేళలో శుభాశుభ శకునాలు
శుభం, అశుభం ఫలితాలు మనకు కలిగే
ముందు అనేక రకాలైన అనేక శకునాలు వాటి
గురించే ముందే సూచిస్తుంటాయి. అలాంటి
శకునాలు అనేకం వున్నాయి.
భోజన సమయంలో ఎలాంటి శకునం, ఎలాంటి శుభ, అశుభ ఫలితాలను
కలిగిస్తుందో తెలుసుకుందాం. భోజనం చేస్తుండగా హఠాత్తుగా వర్షం పడితే మంచి
జరుగుతుంది.
పచ్చదనం, సమృద్ది కలుగుతుంది.
భోజనం చేసేటప్పుడు కాకి వచ్చి
తలపై కూర్చుంటే అశుభం. అలాగే కాకి భోజన
సమయంలో కుడిభుజంపై వాలితే కడుపులో
వికారం, ఎడమ భుజంపై వాలితే కులనాశకుడవటం
జరుగుతుందని సూచన.
భోజనం చేసే వేళలో కుక్క ఏడుపు వినిపిస్తే
అశుభసూచన. అలాగే అవి మొరుగుతే, ధాన్యం
దొంగతనం అవుతుందనటానికి సంకేతం.
ఏదైనా వివాదం భోజనం చేస్తున్నప్పు ప్రారంభమైనా అది
అశుభం. ఆ ఇంట్లో అన్నానికి కొరత
ఏర్పడుతుంది. తినేటప్పుడు ఏడుపు శబ్దం
వినిపిస్తే, విన్న వారికి ఆరోగ్యం దెబ్బ తింటుందని
సూచన.
రొట్టె ఎక్కువగా కాలి మాడిపోతే ఆహార నష్టం
జరుగుతుందని గ్రహించాలి.
ఆ సమయంలో పాము కనిపిస్తే అశుభంగా
పరిగణిస్తారు.
భోజన సమయంలో పాము కనిపిస్తే
భోజనంలో విషం కలిసిందన్న అనుమానానికి కారణం అని పండితుల అభిప్రాయం.
ఇవి భోజన వేళలో శకునాల వల్ల కలిగే, శుభ, అశుభ పరిణామాలు. శకునాలు
మనకు సూచనలు మాత్రమే. వాటికి సంబంధించిన పరిహారాలు, అశుభ శకునాల
నుంచి పరిగ్రహించుకొనుటకు మార్గాలు కూడా
ఉంటాయి.
సూచనలుగా శకునాలను గ్రహించి
జాగ్రత్త వహించటం ఎంతైనా మేలు.

చిదంబరంలో గొప్ప దేవాలయం

తమిళనాడులోని చిదంబరంలో గొప్ప దేవాలయం ఉందనీ , అక్కడున్న నటరాజ విగ్రహం ప్రపంచ ప్రసిద్ధమైనదని మనలో చాలా మందికి తెలుసు.

కానీ అందరినీ అత్యంత ఆశ్చర్య చకితుల్ని చేసే ఎన్నో గొప్ప విశేషాలు
ఈ ఆలయమునకు సంబంధించి ఉన్నాయి. అవి ఏమిటో ఒక్కసారి చదవండి.

చిదంబర రహస్యం !
( ఆలయం ఒక అద్భుతం )
.
.
చిదంబరం లో ఉన్న నటరాజ విగ్రహం యొక్క కాలి బొటన వేలు,
భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల
పరిశోధన అనంతరం పాశ్చాత్య సైంటిస్టులు తేల్చి చెప్పేశారు .

ఈ విషయాన్ని తన గ్రంధం " తిరుమందిరం " లో
ప్రసిద్ధ తమిళ స్కాలర్ తిరుమూలర్ చెప్పారు.
.
ఇపుడు ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం !
.
ఈ ఆలయం ప్రపంచ అయస్కాంత క్షేత్ర మధ్య బిందువుగా ఉంది
.
" పంచ భూతాలు అని మనం చెప్పుకునే భూమి , ఆకాశమూ , వాయువూ , నీరు , అగ్ని లలో చిదంబరం ఆకాశానికి ప్రతీక అనీ , కాళహస్తి వాయువుకు ప్రతీక అనీ , కంచిలోని ఏకాంబరేశ్వరుడు పృథ్వి ( భూమికి ) కి ప్రతీక అనీ అంటారు .

అయితే ఇక్కడ విచిత్రమైన అద్భుతం ఏమిటంటే.......!

ఈ మూడు దేవాలయాలూ ఒకే రేఖాంశం మీద ఉన్నాయి .
అవునండీ ! అవును ..... 79డిగ్రీల 41 నిముషాల రేఖాశం మీద ఉన్నాయి .
ఇది ఆశ్చర్యం కదూ !
.
చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి . మానవుడికి నవ ( 9 ) రంధ్రాలు ఉంటాయి
.
చిదంబరం దేవాలయంలో పైన 21600 బంగారపు రేకులు తాపడం చేశారు . మానవుడు రోజుకు 21600 సార్లు గాలి పీలుస్తాడు . ( 15 x 60x 24 = 21600 )
.
ఆ బంగారపు రేకులు తాపడం చేయడానికి 72000 బంగారపు మేకులు వాడారు . మన శరీరం లో ఉండే నాడులు 72000 అని ఆయుర్వేదం చెబుతుంది .
.

.
దేవాలయం లో " పొన్నాంబళం " కొంచెం ఎడమవైపుకు ఉంటుంది . అది మన హృదయ స్థానం . అక్కడకి వెళ్ళడానికి " పంచాక్షర పడి " ఎక్కాలి .
అది న + మ + శి + వ + య . పంచాక్షరి ని సూచిస్తుంది.

" కనక సభ " లో 4 స్తంబాలు 4 వేదాలకు ప్రతీకలు
.
పొన్నాంబళం లో 28 స్థంబాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు - శివారాధనా పద్ధతులు . ఇవి 64 ఇంటూ 64 దూలాలను సపోర్ట్ చేస్తున్నాయి. 64 కళలు ఉన్నాయని రుజువు ఇది . అంతే కాదు అడ్డు దూలాలు రక్త ప్రసరణ నాళాలు
.
9 కలశాలు 9 రకాల శక్తికి ప్రతీకలు .
అర్ధ మంటపం లోని 6 స్తంబాలూ 6 శాస్త్రాలకు ప్రతీకలు .
ప్రక్కన ఉన్న మంటపం లోని 18 స్తంబాలూ 18 పురాణాలకి ప్రతీకలు
..
నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య సైంటిస్ట్ లు కాస్మిక్ డాన్సు అని వర్ణించారు .
మూలవర్ చెప్పిన ఈ విషయాలు శాస్త్ర సమ్మతాలని నిరూపించడానికి పాశ్చాత్య పరిశోధకులకు 8 సంవత్సరాలు పట్టింది.

జై హిందు...

హనుమంతుడు భీమసేనునికి చెప్పిన యుగధర్మాలు

ఒకరోజు ద్రౌపది భీముడు గంధమాధన పర్వతచరియలలో విహరిస్తున్నారు. వారి ముందు సహస్రదళ పద్మం గాలిలో ఎగురుతూ వచ్చి పడింది. దానిని చూసి ద్రౌపది ముచ్చట పడింది. అలాంటి పద్మాలు మరికొన్ని కావాలని భీముని కోరింది. ద్రౌపది కోరిన సౌగంధికా పుష్పాలు తెచ్చేందుకు బయలుదేరాడు. అలా వెళుతూ భీముడు సింహనాదం చేసి శంఖం పూరించాడు. ఈ శబ్ధాలను అక్కడ ఉన్న హనుమంతుడు విన్నాడు. ఆ వచ్చినది తన సోదరుడు భీముడని గ్రహించాడు. గుహలో నుండి బయటకు వచ్చి అక్కడ ఉన్న చెట్లను పెరికి దారికి అడ్డం వేసాడు. తాను కూడా దారికి అడ్డంగా పడుకుని తోకను విలాసంగా ఆడించసాగాడు.
భీముడు అక్కడికి వచ్చి హనుమంతుని చూసి సింహనాదం చేసాడు.ఆ శబ్ధానికి హనుమంతుడు కళ్ళు తెరిచి " ఎవరయ్యా నీవు? పెద్దవాడిని, అలసిపోయి పడుకున్న వాడిని పడుకుని ఉంటే ఇలా అరవడం తగునా? అడవిలో ఉన్న పండ్లు ఫలాలు తిని వెళ్ళు ఇలా అరవకు " అన్నాడు హనుమంతుడు. భీముడు " నేను పాండురాజు పుత్రుడను, ధర్మరాజు తమ్ముడిని. నా నామధేయం భీమసేనుడు. నేను కార్యార్ధినై వెళుతున్నాను. నాకు దారి వదులు " అన్నాడు. హనుమంతుడు " నేను ముసలి వాడిని కదలలేను. నీవే నా తోకను పక్కన పెట్టి నీ దారిన నీవు వెళ్ళచ్చు " అన్నాడు హనుమంతుడు. భీముడు అదెంత పని అని తోకను ఒక్క చేత్తో ఎత్తి పెట్టబోయాడు. తోక కదల లేదు.రెండు చేతులు ఎత్తి పట్టుకుని ఎత్తబోయాడు. అప్పుడూ కదల లేదు. భీముడు అది చూసి ఆశ్చర్య పోయాడు. భీముడు హనుమంతునితో "అయ్యా! మీరెవరో నాకు తెలియదు.కాని మీరు మహాత్ములు. నన్ను మన్నించండి " అన్నాడు.
హనుమంతుడు భీమునితో " భీమా! నేను హనుమంతుడిని, నీ అన్నను వాయు పుత్రుడను. నేను రామబంటును. రావాణుడు రాముని భార్యను అపహరించగా నేను లంకకు వెళ్ళి సీతమ్మ జాడను తెలుసుకుని రామునికి తెలిపాను. రాముడు రావణుని సంహరించి సీతమ్మను పరిగ్రహించాడు. రాముడు నా సేవలకు మెచ్చి నన్ను చిరంజీవిగా ఉండమని దీవించాడు " అప్పటి నుండి నేను గంధమాధన పర్వతంపై నివసిస్తున్నాను " అని చెప్పాడు.అది విన్న భీముడు సంతోషించి "ఆంజనేయా! నీవు అలనాడు సముద్రాన్ని లంఘించిన రూపాన్ని చూడాలని కోరికగా ఉంది. ఒక్క సారి చూపించవా? " అని అడిగాడు. హనుమంతుడు "భీమా! అది ఎలా కుదురుతుంది. ఆ కాలం వేరు ఈ కాలం వేరు యుగధర్మాలు కృతయుగంలో ఒకలా, త్రేతాయుగంలో వేరేలా, ద్వాపరంలో మరోలా ఉంటుంది. అలాగే కలియుగంలో పూర్తి విరుద్ధంగా ఉండబోతుంది " అన్నాడు.
భీముడు " అన్నయ్యా! ఆయా యుగాలలోని ఆచారాల గురించి చెప్పవా? " అన్నాడు. హనుమంతుడు ఇలా చెప్పసాగాడు " భీమసేనా! కృతయుగంలో అన్నీ కృతములే కాని చెయ్యవలసినది ఏమీ లేదు. అందుకనే ధర్మం నాలుగు పాదాలతో నడిచింది. అప్పుడు శ్రీమన్నారాయణుడు శుక్లవర్ణంతో ప్రజలను కాపాడాడు. సనాతన ధర్మం వర్ధిల్లింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు వేదాలు తమకు విధించిన విధులు నిర్వర్తించారు. వారు కోరకుండానే తగిన ఫలితాలు కలిగాయి. కనుక వారు పుణ్యలోకాలకు పొందారు. ఆ యుగంలో జనులకు అసూయ, ద్వేషము, గర్వము, మదము, మాత్సర్యము, కోపము, భయం, సంతాపం, ప్రజాక్షయం, అవయవక్షయం లాంటివి లేవు.
తరవాత త్రేతాయుగం ఆరంభమైంది. ధర్మం మూడుపాదాలతో నడిచింది. ఆ రోజుల్లో ప్రజలు సత్యసంధులు, యజ్ఞయాగాదులు చేసే వారు, తపస్సులు చేసే వారు, దానాలు చేసేవారు. అప్పుడు విష్ణువు రక్తవర్ణంతో ప్రజలను రక్షించాడు. ద్వాపరయుగం వచ్చింది. ధర్మం రెండు పాదాలతో నడిచింది. వేదములు, శాస్త్రములు విధించిన ధర్మము కామము అనుసరించబడ్డాయి. కాని ద్వాపరయుగంలో ప్రజలు మాటమీద నిలవరు, సత్యము శమము హీనమౌతుంది. ప్రజలు కామ్యార్ధం మాత్రమే యజ్ఞాలు చేస్తారు. ఈ యుగంలో విష్ణువు కృష్ణవర్ణంతో ప్రజా రక్షణ చేస్తాడు. తరవాత వచ్చునది కలియుగం. ఈ యుగంలో ధర్మం ఒక పాదంతో నడుస్తుంది. విష్ణువు పసుపు పచ్చని వర్ణంతో లాలాలను రక్షిస్తాడు. కలియుగంలో జనులు తమోగుణంతో ప్రవర్తిస్తారు. జనులు కామము, క్రోధము మొదలైన వాటికి వశులై అధర్మ వర్తనుడై ప్రవర్తిస్తారు. కలియుగంలో తపస్సు, ధర్మము, దానము లాంటి పుణ్యకార్యాలు స్వల్పంగా ఆచరించబడతాయి. కాని వాటికి ఫలితం విసేషంగా ఉంటాయి " అని హనుమంతుడు చెప్పాడు.
భీముడు "ఆంజనేయా! అలనాడు నీవు సాగరం దాటిన భీమరూపాన్ని చూడకుండా నేను ఇక్కడ నుండి కదలను " అన్నాడు. ఆంజనేయుడు సాగరాన్ని దాటినప్పటి రూపాన్ని భీమునకు చూపాడు. రెండవ మేరు పర్వతమా అని భ్రమింప చేసే ఆంజనేయుని విరాట్రూపం చూసి భీముడు భీతి చెంది ఆ రూపాన్ని ఉపసంహరింపమని హనుమంతుని వేడుకున్నాడు. హనుమంతుడు రూపాన్ని ఉపసంహరించి "భీమసేనా! నీవు కావాలి అనుకున్న సౌగంధికా పుష్పములు ఉన్న కొలనును యక్షుల, గంధర్వులు సంరక్షిస్తుంటారు. అక్కడ నీ శౌర్యప్రతాపాలు పనికి రావు. ఆ పుష్పాలు దేవతలు అనుభవిస్తుంటారు. దేవతలు భక్తికి లొంగుతారు కనుక ధర్మమెరిగి ప్రవర్తించు. సదాచారం నుండి ధర్మం పుడుతుంది. ధర్మం వలన వేదం ప్రతిష్టించ బడుతుంది. వేదముల వలన యజ్ఞాలు చేస్తారు. యజ్ఞాలవలన దేవతలు సంతృప్తి చెందుతారు.

సప్తచిరంజీవులు..

1. అశ్వత్థామ :- ద్రోణాచార్యుని కుమారుడు.
మహాభారత యుద్ధం అనంతరం మిగిలిన దుర్యోధనుని పక్షపు వీరులలో ఒకడు..

2. బలిచక్రవర్తి :- ప్రహలాదుని కుమారుడైన విరోచనుని కుమారుడు.ఇంద్రుని జయించినవాడు.
వామనమూర్తికి మూడడుగుల భూమిని దానం చేసి, అతనిచే పాతాళమునకు త్రోక్కబడ్డాడు. కానీ ఇతని సత్య సంధతకు మెచ్చుకున్న వామనుడు గదాదారిగా ఇతని వాకిటికి కావాలి కాచేవాడు..

3.వ్వాసమహర్షి :-సత్యవతీ పరాసరుల కుమారుడు. కృష్ణ ద్వాయపాయనముని అని పిలవబదేవాడు.
అస్తాదాస పురాణాలను,
బ్రహ్మసూత్రములను ,
భారత భాగవతములను మరియు అనేక తత్వ గ్రంధములను రచించాడు.
వేదాలను విడబరచిన వారు అని వ్యాసుడుని పేర్కొంటారు..

4.హనుమంతుడు :-కేసరి భార్య అయిన అంజన పుత్రుడే హనుమంతుడు. భర్త ఆజ్ఞా ప్రకారం వాయుదేవుని కొలిచిన అంజనాదేవికి వాయుదేవుడు ప్రత్యక్షమై తన గర్భంలో శివుని శక్తిని ఆమెకు వరముగా ఇవ్వగా అంజనా గర్భమున హనుమంతుడు పుట్టాడు.
సూర్యుని శిష్యుడు ఈ రామ భక్తుడు.
పరమేశ్వరుని అవతారము.
రావణాది రాక్షసులను ఎదిరించి, సీత ఉనికిని తెలుసుకొని లంకేస్వరుని హతమార్చతంలో శ్రీ రామునికి ఎనలేని సేవ చేసిన మహాభక్తుడు హనుమ.
మహా భారతయుద్ధంలో అర్జునిని ధ్వజమున వెలసి పాండవుల విజయానికు కూడా దోహదకారి అయ్యాడు.

5.విభీషణుడు :- కైకసికిని విస్వబ్రహ్మకు కలిగిన మూడవ కుమారుడు. బ్రహ్మపరమున ఇతడు సుశీలుడైయ్యాడు. ఈయన భార్య పరమ అనే గాంధర్వ స్త్రీ. రావణుని దుర్మార్గాలను నిర్భీతిగా విమర్శించి, సన్మార్గము గూర్చి చెప్పేవాడు. సముద్రము దాటుటకు , రావణుని హతమార్చుటకు శ్రీ రామునికి ఉపాయము చెప్పాడు.రావణుని అనంతరం లంకాధిపతి అయ్యాడు..

6.కృపాచార్యుడు:- సప్త చిరంజీవులలో 6వ వాడు . కృపుడు శరద్వంతుని కుమారుడు..
శరద్వంతుడు ధనుర్వేదమును పొంది తపస్సు చేసుకునేవాడు.
ఇంద్రుడు ఇతని తపస్సును భగ్నము చేయుటకై  ఒక అప్సరసను పంపాడు. ఆమెను చూడగానే ఇతడు కామ పరవశుడై ఆ చోటును వొదిలి వేరే చోటుకు వెళ్ళాడు.
ఆ సమయమున కల్గిన కుమారుడు కృపుడు.
కృపుడు శరద్వంత దగ్గర ధనుర్వేదమును నేర్చుకున్నాడు. భీష్ముని కోర్కె మన్నించి  ధనుర్విద్యను నేర్పాడు.
మహాభారత యుద్ధం లో దుర్యోధనుని పక్షమున నిలిచి యుద్ధం చేశాడు . యుద్ధం అనంతరం జీవించిన వీరులలో కృపుడు ఒకడు.

7.పరశురాముడు:-
రేణుకా జమదగ్నుల కుమారుడు. జమదగ్నికి తాత బృగు మహర్షి ఉపదేశంతో హిమాలయాలకు వెళ్లి శివుని గూర్చి తపస్సు చేశాడు .ఈశ్వరుడు బోయవాని వేషమున వచ్చి పరశురాముని పరీక్షించాడు .శివుని ఆఙ్ఞతో తీర్ధయాత్రలు చేశాడు.శివ అనుగ్రహముతో భార్ఘవాస్త్రమును పొందాడు..

కైలాస పర్వతానికి నాలుగు రూపాలు

కైలాస పర్వతానికి నాలుగు రూపాలు కూడా వున్నాయి. ఒకవైపు సింహం, రెండోవైపు గుర్రం, మూడోవైపు ఏనుగు, నాలుగోవైపు నెమలిలాగా ఈ పర్వతశిఖరం కనిపిస్తుంది. అందులో గుర్రం హయగ్రీవ రూపంలోను, సింహం పార్వతి దేవి వాహనం, నెమలి కుమారస్వామికి వాహనం కాగా ఏనుగు విఘ్నేశ్వరునికి ప్రతీకగా వుంటాయి.
నలువైపులా మంచుతో కపబడివున్న ఈ పర్వతం.. పౌర్ణమినాడు మిలమిల మెరుస్తూ ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. దీని మొత్తం చుట్టుకొలత 52 కిలోమీటర్లు. ప్రపంచంలో ఇంతవరకు ఎవరూ ఈ కైలాస పర్వతంపై అధిరోహించలేదు. ఎవరికి సాధ్యం కాలేదు కూడా. పూర్వం కొంతమంది సాధువులు ఈ అధిరోహించేందుకు ప్రయత్నించి, మధ్యలోనే అదృశ్యమయ్యారు. ఎందుకంటే… నాలుగు మతాలవారు ఎంతో ఆధ్యాత్మికంగా పూజించే ఈ పర్వత వాలుపై కాలుపెట్టడం మహాపాపమని ప్రతిఒక్కరు విశ్వసిస్తారు.
అయితే ఈ మూఢవిశ్వాసాన్ని పోగొట్టేందుకు చైనా ప్రభుత్వం వారు దీనిపై పరిశోధనలు కూడా చేశారు. రెండుసార్లు ఈ పర్వతంపై పంపించిన హెలికాప్టర్లు మధ్యలోనే కూలిపోయాయి కూడా. దాంతో అప్పటినుంచి ఈ పర్వతం జోలికి ఎవ్వరు వెళ్లలేదు. ఈ పర్వత ఉపరి భాగంలో ఏముందో తెలుసుకోవడానికి సైన్స్ కి కూడా ఇంతవరకు అంతపట్టడం లేదు. యోగశాస్త్రంలో ఈ పర్వతాన్ని షమస్ర చక్రంగా పేర్కోవడం జరిగింది.
పూర్వం రావణాసురుని తల్లి వ్యాధితో బాధపడుతుండుగా.. ఎంతో ఆధ్యాత్మికంగా పూజించే శివుని దర్శనం కల్పించడానికి రావణుడు తన వీపు మీద ఈ కైలాస పర్వతాన్ని పెట్టుకుని తల్లి దగ్గరకు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తాడు. శివుడు అతని ధైర్యానికి మెచ్చి.. అతనికి ఆత్మలింగాన్ని ప్రసాదిస్తాడు.
మానస సరోవరం :
కైలాస పర్వతానికి పాదపీఠంలోనే మానస సరోవరం ఎంతో అపురూపంగా దర్శనమిస్తుంటుంది. మానస్ అంటే మెదడు.. అంటే బ్రహ్మ తన మెదడు నుంచి ఈ సరస్సును సృష్టించాడని హిందూ పురాణాలు చెబుతున్నారు. పూర్వం శివుడు ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో బ్రహ్మీ ముహూర్తంలో ఈ మానస సరోవరంలోనే స్నానం ఆచరించేవాడని ఇక్కడి భక్తులు విశ్వసిస్తారు. అంతేకాదు.. ఈ సరస్సుకు చుట్టుపక్కల వుండే గృహాల్లో చాలామంది మునులు కొన్ని వేల సంత్సరాలుగా తపస్సు చేసేవారని కూడా చెబుతుంటారు. ఇక్కడే ఔషధ విలువలైన మొక్కలు కూడా కొన్ని కనిపిస్తాయి.
కైలాస పర్వతం
కైలాస పర్వతం… అంటే మౌంట్ కైలాష్. ఇది టిబెట్ భూభాగంలో వున్న హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్రమట్టానికి 6.638 మీటర్ల ఎత్తులో వుంది. ఈ పర్వతం నాలుగు మతాలలో పవిత్ర స్థలంగా భావించబడుతుంది. అవి బోన్, బుద్ధిజం, హిందూమతం, జైనిజం. హిమాలయాల్లో వున్న అనేక పర్వతాలలో కంటే ఈ కైలాస పర్వతానికే ఎన్నో విశిష్టతలు వున్నాయి. సమస్త మానవాళికి అర్థంకాని రహస్యాలు ఇక్కడెన్నో వున్నాయి. హిందూమతం ప్రకారం.. శివుడు, పార్వతీ సమేతుడై ఇక్కడే కొలువై వున్నాడని పురాణాలలో కొన్ని కథలు కూడా వున్నాయి.
మొత్తం ఆసియాలోనే పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర, సింధూ, సట్లజ్, గంగానదికి ఉపనది అయిన కర్నాలి మొదలైన నదుల మూలాలు ఈ పర్వత ప్రాంతంలోనే వున్నాయి. కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో కనిపిస్తూ.. నాలుగు రంగుల్లో దర్శనమిస్తుంటుంది.
హిందూ ధర్మం ప్రకారం.. శివుడు ఈ కైలాస పర్వత శిఖరంలో నివసిస్తున్నాడు. పార్వతీ సమేతుడై నిరంతరం ధ్యాన పరిస్థితిలో వుంటాడు. విష్ణుపురాణం ప్రకారం కైలాస పర్వత నాలుగు ముఖాలు స్ఫటిక, బంగారం, రుబి, నీలం రాయితో రూపొందించినట్లు తెలుపబడింది. ప్రపంచానికి పునాది వంటిది. తామరు పువ్వు ఆకారంలో వున్న ఆరు పర్వతాల మధ్య ఈ కైలాస పర్వతం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుింది.

జగద్గురు ఆది శంకరాచార్య

జగద్గురు ఆది శంకరాచార్య


సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం



         కైలాస వాసుని అవతారంగా భావించబడే శంకరుల కృప వలన మనకు ఈ రోజు హిందూ మతములో స్పష్టత, పారదర్శకత, లోతు, ఐక్యత ఉన్నవని అనుటలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. ఎందరో మహర్షుల, ఋషుల నోట అంతర్యామి వాక్కులుగా పలుకబడిన శక్తి వేదములుగా ప్రకాశిస్తున్నాయి. ఎవరో రచించి, మరెవరో పరిశీలనము, విమర్శ చేసేందుకు అవి పురాణాలు, నవలలు కావు. విశ్వవ్యాప్తుని మనోకమలము నుండి స్వయంగా మహాపురుషుల నోట వెలువడిన సచ్చిదానందములు వేదములు. అంతటి వేదములకు కూడా వక్ర భాష్యము చెప్పి, భారతీయ సమాజంలో విభజన కలిగించి, మూఢ చాందస భావాలను ప్రేరేపించి అన్యమతముల వైపు ప్రజలను మళ్లించిన సమయంలో ఆ పరిస్థితిని చక్క దిద్దటానికి శంకరులు కాలడిలో శివ గురు శక్తితో ఆర్యాంబ గర్బములో ఉత్తరాయణ పుణ్య కాలమున వైశాఖ శుద్ధ పంచమి నాడు అవతరించారు. చిన్ముద్రతో, మౌనంతో జ్ఞానాన్ని వ్యాపింప జేసే దక్షిణామూర్తి రూపమైన పరమ శివుడు ఈ దంపతులను ఆశీర్వదించగా శంకరులు ఉదయించారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆయన దైవిక శక్తి, మార్గము కాలడిలో ప్రస్ఫుటించాయి.

మూడవ యేటనే తండ్రిని కోల్పోయిన శంకరులకు ఐదవ యేట ఉపనయన సంస్కారము జరిగింది. బ్రహ్మచర్య దీక్షలో భాగంగా మాధుకరం కోసం భిక్షాటనకు వెళ్లిన శంకరులకు ఒక పేద బ్రాహ్మణుని యింటి యిల్లాలు వద్ద ఉసిరికాయ తప్ప ఏమీ దొరకలేదు. ఆమె దుస్థితికి కరిగిన శంకరులు లక్ష్మీదేవిని కనకధారా స్తోత్ర రూపంలో ప్రార్థించగా ఆ తల్లి కరుణించి ఆ ఇంట బంగారు ఉసిరికలు కురిపించి వారి దారిద్ర్యాన్ని పోగొట్టిందిట. దిన దిన ప్రవర్థమాన మవుతున్న శంకరులకు మహర్షులు వచ్చిన దేశాన్ని ఉద్ధరించాలన్న కర్తవ్యాన్ని గుర్తు చేస్తారు. తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి శంకరులు భారత దేశ యాత్ర మొదలు పెడుతారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నర్మదానదిని తన కమండలములో బంధించిన శంకరుని చూసి ముగ్ధులైన గురు గోవింద భగవత్పాదులు శంకరులను తన శిష్యునిగా స్వీకరిస్తారు. గోవింద భగవత్పాదులు శంకరులకు వేదవేదాంగాలు ఉపదేశిస్తారు. ఆత్మ, పరమాత్మ ఒక్కటే అన్న అద్వైత సిద్ధాంతాన్ని కూడా శంకరులకు బోధిస్తారు. ఆ సందేశాన్ని ప్రపంచానికి చాటమని శంకరులను ఆశీర్వదించి పంపిస్తారు.

శంకరులు కాశీకి పయనమవుతారు. అక్కడికి చేరే సమయానికి ఆయనకు చాలా మంది శిష్యులు ఏర్పడుతారు. ఒకసారి ఒక శిష్యుడు నది ఈవలి ఒడ్డున గురువుల వస్త్రములు ఆరవేస్తుండగా శంకరులు అతనిని ఆవలి ఒడ్డు నుండి పిలుస్తారు. గురువుగారి పూర్తి ధ్యాసతో ఆ శిష్యుడు అడుగులు వేస్తూ నదిని దాటుకుంటూ వెళుతాడు. ఆ శిష్యుడు అడుగు వేసిన ప్రతిచోట ఒక పద్మము వెలసి ఆయనను నీట మునగ కుండా కాపాడుతుంది. అంతటి మహిమాన్వితమైన గురుకృపను పొందిన ఆ శిష్యుడు పద్మపాదునిగా పేరు పొందాడు.

ఒక రోజు శంకరులు గంగానదిలో స్నానం ముగించుకుని శిష్యులతో కలిసి విశ్వనాథుని మందిరానికి వెళుతున్నప్పుడు ఒక నిమ్న జాతికి చెందిన వాడు ఎదురు పడతాడు. అప్పటి ఆచారాల ప్రకారం శంకరులు వాడిని తప్పుకో, దారి విడువుము అని అంటాడు. అప్పుడా చండాలుడు నీవు తప్పుకోమంటున్నది ఈ దేహమునా? నా ఆత్మనా? అని ప్రశ్నిస్తాడు. అప్పుడు శంకరులు తన అహంకారానికి పశ్చాత్తాపపడి ఆ చండాలుని పరమశివునిగా గ్రహించి ప్రణమిల్లుతాడు. ఆ సందర్భంలో చండాలుని రూపములో ఉన్న శివుడు శంకరుని ఉద్దేశించి వేసిన ప్రశ్నలు మొదటి రెండు శ్లోకములు, అటు తర్వాత శంకరుల నోట వెలువడిన శ్లోకాలు మనీషా పంచకంగా పేరొందాయి. అద్వైతామృత సారమైన ఈ మనీషా పంచకం పరబ్రహ్మమొక్కటే అన్న సందేశాన్ని శంకర భగవత్పాదుల నోట మనకు అందించబడినది. తనలో ఉన్న ఆఖరి దుర్గుణమును ఈ సందర్భముగా శంకరులు దగ్ధము చేసుకునే అవకాశమును ఆ పరమ శివుడు చండాలుని రూపములో కలిగించాడు.

బ్రహ్మసూత్రాల కర్త అయిన వ్యాసుల వారి అనుగ్రహంతో వాటి భాష్యాలను అద్వైత సిద్ధాంతంతో పాటు దేశవ్యాప్తంగా ప్రచారం చేయటానికి పయనమవుతారు శంకరులు. దేశాటన చేస్తూ కాంచీపురంలో కామకోటి పీఠం, శృంగేరి శారదా పీఠం వంటి ఎన్నో క్షేత్రాలను స్థాపించారు. ఎన్నో వేల దేవాలయాలను పునరిద్ధరించారు. తిరువైమరుదూరు, తిరుచ్చి, శ్రీశైలము మొదలైన ప్రదేశాలలో ఎన్నో అద్బుతమైన స్తోత్రాల ద్వారా అక్కడి పుణ్యక్షేత్రాలను పునరుత్థానం చేసారు. హఠకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కీకారణ్యములు. ఇక్కడ కాపాలికులు నివసించే వారు. కాపాలికులు శ్మశానాలలో ఉంటూ ఆటవిక జంతు మానవ బలుల ద్వారా దేవతలకు ప్రీతి కలిగించే వారు. ఆది శంకరులు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరులను ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడిగాడుట. అందుకు శంకరులు సమ్మతించి బలికి సిద్ధమయ్యారు. కాపాలికుడు శంకరుల తల నరుకబోగా విష్ణుమూర్తి నృసింహ రూపంలో ప్రత్యక్షమై కాపాలికుని సంహరించాడు.

తల్లి ఆర్యాంబ మరణించినప్పుడు సన్యాసియైన తాను ఆమెకు ఉత్తరక్రియలు చేయకూడదని తన కంటి నుండి అగ్నిని సృష్టించి ఆమె చితికి నిప్పు రాజిల్ల జేస్తారు. తన అనుపమానమైన శక్తితో మూకాంబిక, కోటచాద్రి, తిరుమల, పురీ, ద్వారక మొదలైన క్షేత్రాలను అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా తీర్చిదిద్దుతారు శంకరులు.భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో మానసికోత్థానం కోసం, హిందూ మత శాఖల, పీఠాల ఐక్యత కోసం, ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. ఎందరో పండితులు, విమర్శకులను ఒప్పించి దేశ వ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపించారు. పామరులనుండి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి, ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద నిలిచేలా చేశారు.

తన యాత్రల చివరలో శంకరులు బదరీ క్షేత్రానికి వెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయనను అలకనంద నదిలో ఉన్న తన విగ్రహాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయమని నిర్దేశిస్తాడు. శంకరులు అక్కడ బదరీనారాయణ క్షేత్రాన్ని, జ్యోతిర్మఠాన్ని స్థాపించి ఆ పరమాత్మలో ఐక్యమవుతారు.ఆ శంకరుల కృప వలననే మనకు నేడు అష్టాదశ శక్తి పీఠములు, చార్ ధామ్ మొదలైన పుణ్య క్షేత్రాలు, వాటి వలన మనకు అత్యున్నతమైన హైందవ అద్వైత సిద్ధాంత సారమైన జీవనశైలి, సమాజము భాసిల్లుతున్నాయి.

శంకరుల రచనలు:

ఆయన చేసిన స్తోత్రాల్లో మనీషా పంచకము, సాధన పంచకము, భజగోవిందము, గోవిందాష్టకము, పాండురంగాష్టకము, శివ సువర్ణమాలా స్తోత్రము, అర్థనారీశ్వర స్తోత్రము, కాలభైరవాష్టకము, దక్షిణామూర్తి స్తోత్రము, నిర్వాణ షట్కము, అన్నపూర్ణాష్టకము, అచ్యుతాష్టకము, మహిషాసుర మర్దిని స్తోత్రము, త్రిపురసుందరీ స్తోత్రము, భుజంగాష్టకాలు, భవాన్యష్టకము, దేవీనవరత్నమాలికా, విశ్వనాథాష్టకము, ఉమామహేశ్వర స్తోత్రము
        ఇలా ఎన్నో సామాన్య జనులకు జీవన దిశానిర్దేశము చేసే స్తుతులను రచించారు. ఆధ్యాత్మికంగా ఇంకొక పై మెట్టులో సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి మొదలైనవి, ఇంకొక పై మెట్టుపై భాష్యాలు.

ఆదిశంకరుల రచనలు మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మీద రాసిన భాష్యాలు. రెండవది వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి. మూడవది దేవతా స్తోత్రాలు. కొన్ని స్తోత్రాల వివరాలు.

విష్ణు షట్పది:

మనస్సుపై స్వాధీనము కొరకు విష్ణుని ప్రార్థిస్తూ రచించిన ఈ స్తోత్రము మానసిక ప్రశాంతతకు చాలా తోడ్పడుతుందని నమ్మకం. భయము, అహంకారముతో కప్పబడిన ఈ జీవితం భవ సాగరమై మరిన్ని జన్మలకు కారణము అవుతుంది. కావున, వాటిని అధిగమించి, మనసును లగ్నము చేసి, ధ్యేయము వైపు ధ్యానించి సత్య జ్ఞాన ప్రాప్తికి కృషి చేయవలెను అని ఈ స్తోత్రము ద్వారా మనకు ఆది శంకరులు చక్కని సందేశాన్ని అందించారు. భయమే మృత్యువు, భయమే శత్రువు. అహంకారమే పతనము. అహంకారమే అత్యంత ప్రమాదకరమైన శత్రువు. వాటిని అధిగమించటం ఆధ్యాత్మిక పరమార్థము. అదే పరమాత్ముని దర్శనము. అదే మోక్ష కారకము.

సాధనా పంచకము:

శంకరులు అద్వైత సిద్ధాంతమును కాలి నడకలో భారత దేశమంతా తిరుగుతూ ప్రచారం చేసి, దానికోసం కావలసిన పీఠాలను, ధార్మిక క్షేత్రాలను స్థాపించారు. సద్గురు సాంగత్యము, శిష్యరికము, దైవారాధన, నిత్య నైమిత్తిక చర్యలు, ధ్యానము, యోగము, సత్సంగము, భక్తి మొదలైన సాధనాలతో పరబ్రహ్మ తత్త్వమును గ్రహించి, అనుభూతి పొందవచ్చు అని శంకరులు మనకు దివ్యామృతమును అందజేశారు.

దీనికోసం ఏమి చేయాలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఐదు సూత్రాలను ఆదిశంకరులు మనకు సాధనా పంచకం రూపంలో ఇచ్చారు. ఇందులో విషయము చాలా సులభముగా అనిపించినా, అది ఆచరణలో పెట్టటానికి ఎంతో నియమము, నిగ్రహము, పట్టుదల అవసరం. ఉదాహరణకు - వేదములను అధ్యయనం చేద్దాము - అనేది ఒక ధ్యేయము. మరి దానికి సరైన గురువు, పాఠశాల, క్రమశిక్షణతో కూడిన దైనందినచర్య, అభ్యాసము, ఏకాగ్రత, సాధన - ఇవన్నీ కావాలి. అలాగే, అహంకారము వదలుట అనేది ఒక ధ్యేయము - మరి దీనికి మన అలవాట్లు, మానసిక స్థితి ఏవిధంగా ఉండాలో ఊహించండి. నియమిత సాత్త్విక ఆహారము తీసుకోవటం, సుఖములకు, దుఖములకు అతీతంగా, రాగద్వేషాలు లేకుండా - ఒక రకమైన ఉదాసీన వైఖరిని అలవరచుకోవాలి. దీనికి మళ్లీ పైన చెప్పిన గురువు, అభ్యాసము, సాధన, క్రమశిక్షణ అన్నీ అవసరం.సాధనా పంచకాన్ని ఒక శిఖర మార్గముగా తీసుకుని, దానిలో ఉన్న ప్రతి పరమాణు ధ్యేయములకు సద్గురువును ఆశ్రయించి, శ్రుతులను అనుగమిస్తూ, జీవన శైలిలో వాటిలో పయనిస్తూ, అవరోధాలను అధిగమిస్తూ అవరోహణ చెయ్యాలి. దీనికి భక్తి, జ్ఞానము, వైరాగ్యము, పరిశ్రమ, సహనము, శ్రద్ధ అన్ని తోడు చేసుకోవాలి. అప్పుడే ఆ సచ్చిదానంద స్థితిని పొందగలరు. ఈ పంచకము లోని భావమును, నిగూఢమైన ఆశయములను, సందేశమును తెలుసుకోవలసినదిగా సాధకులకు శంకరుల ఉద్దేశము.

శివ సువర్ణమాలా స్తుతి:

యాభై శ్లోకాలలో లయ బద్ధమైన పదాలు, భక్తి, సర్వస్య శరణాగతి, ఆత్మానుభూతి, లోతైన వివేచనము తో సాగే సువర్ణమాల స్తోత్రమును ఆ అపర శంకరుడు ఆది శంకరులు రచించారు. సాంబ = స+ అంబ - నిరంతరం ఆ జగదంబ అయిన పార్వతితో కూడి అర్థనారీశ్వరుడై ఉన్నాడు కాబట్టే ఆ పరమ శివుడు సాంబుడు అయినాడు. పార్వతీ సమేతుడవైన శివా! శంభో! నీ పాదములకు నమస్కారములు. నాకు శరణునిమ్ము అనే అంతరార్థంతో సాగే ఈ స్తోత్రములో శివుని అశేష కీర్తి, అగణిత గుణ గణములను ఆది శంకరులు నుతించారు. స్తోత్రము ముందుకు సాగుతున్న కొద్దీ ఆ పరమశివుని వర్ణన, కైలాసము ఎదుట ఉందా అన్న భావన ఆదిశంకరులు కలిగిస్తారు. యాభై శ్లోకాలు అనర్గళంగా ఒకే దేవతపై రాయాలంటే ఆత్మ జ్ఞాన పరిపూర్ణుడై, దైవ సాక్షాత్కారము కలిగి, ఎల్లప్పుడూ ఆ దైవము కన్నుల ఎదుట నిలిచి ఇటువంటి అనుభూతిని కలిగిస్తే, ఆ ఆవేశం స్తోత్ర రూపంలో వెలువడి ఇన్ని వేల ఏళ్ళు నిలబడ గలుగుతుంది.

ఆయన మహిమను తెలిపే ఒక స్తుతి - తోటకాష్టకము:

ఆ శంకరుని శిష్యులలో ఒకడైన ఆనందగిరి తన గురువులను స్తుతిస్తూ రచించిన తోటకాష్టకం ఆ శంకరుల లక్షణాలను, వైభవాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తుంది.ఆనందగిరి ఈ స్తోత్రాన్ని తోటక ఛందములో రాయటం వలన దీనికి తోటకాష్టకం అని పేరు వచ్చింది. దీని వెనక ఒక చిన్న కథ ఉంది.
శంకరుల శిష్యులలో ఆనందగిరి కొంత మంద బుద్ధి. కానీ, అమితమైన గురు భక్తి కలవాడు. నిరంతర గురు సుశ్రూషలో ఉండేవాడు గిరి. ఒక రోజు, శంకరులు తన ప్రాతః కాల దినచర్యలో భాగంగా ఉపనిషత్ ప్రవచనం ఆరంభించారు. ఆ సమయంలో శిష్యులంతా శాంతి పాఠం మొదలు పెట్టారు. కానీ, గిరి మాత్రం అక్కడ లేదు. గురువు గారి వస్త్రములు ఉతకటానికి నది దగ్గరకు వెళ్ళాడు. శంకరులు ఇది గమనించి మిగిలిన శిష్యులను గిరి వచ్చేదాకా వేచి ఉండమని పలుకుతారు. అప్పుడు పద్మపాదుడనే శిష్యుడు గర్వముతో 'వాడు మూర్ఖుడు, వానికి శాస్త్రములు నేర్వవలసిన అర్హత లేదు. వానికోరకు ఎందుకు వేచి ఉండటం' అని అంటాడు. శంకరులు పద్మపాదుని గర్వము అణచుటకు, తన దైవ శక్తితో ఆనందగిరికి సకల శాస్త్ర పరిజ్ఞానమును క్షణకాలములో కలిగేలా చేస్తారు. నది వద్దనుండి తిరిగి వచ్చిన ఆనందగిరి గురువుగారిని నుతిస్తూ తోటకాష్టకాన్ని ఆశువుగా పఠించాడు మిగిలిన శిష్యులకు సిగ్గు, విస్మయం కలిగించేలా అతి కష్టమైనా తోటక ఛందములో ఎనిమిది శ్లోకాలతో అద్భుతంగా సాగుతుంది తోటకాష్టకం. అటు తర్వాత, ఆనందగిరి శృతి సార సముద్ధరణ అనే ఇంకొక రచన కూడ తోటక ఛందములో చేస్తాడు. శంకరుల నలుగురు ముఖ్య శిష్యులలో ఒకడై , తోటకాచార్యులుగా పిలవబడి, గురువులచేత బదరీలోని జ్యోతిర్మఠం నడపటానికి నియమించబడతాడు.

ముగింపు:

ఎంతో మంది స్వాములు, యతులు తర్వాత భారత దేశంలో జన్మించి, ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రచారం చేశారు, కానీ శంకరులు సుస్థిర పరచిన అద్వైత సారము, ధార్మిక సిద్ధాంతాలు, పద్ధతులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా, ప్రామాణికాలై కాలపు ఒడిదుడుకులను తట్టుకొని హిమాలయముల వలె ఉన్నతముగా నిలిచినది. ఇట్టి ఆధ్యాత్మిక సంపదను ఇచ్చిన ఆ పరమ శివ రూపమైన జగద్గారువులకు శత సహస్ర పాదాభివందనములు

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles