దీపావళితో ఆశ్వయుజమాసంతో ముగుస్తుంది. మర్నాటి నుంచి కార్తీకమాసం ఆరంభమవుతుంది. శివకేశవులిద్దరికీ ప్రీతిపాత్రమైన ఈ మాసంలో ప్రత్యేక వ్రతాచరణకు ప్రాముఖ్యత వుంది. ఈ వ్రత మహత్యాన్ని నైమిశారణ్యంలో సూత మహర్షి శౌనకాది మునులకు వివరించారు.
వ్యాసమహర్షి తాను రచించిన స్కాంద, పద్మ పురాణాల్లో కార్తీకవ్రత మహిమను సవిస్తరంగా వివరించారని పేర్కొన్న సూతమహర్షి, ఆ రెండు పురాణాల్లోనూ వర్ణితమైన వ్రతవిధాన, దీక్ష, మహిమాదుల్ని ముప్పై అధ్యాయాల్లో ఆవిష్కరించారు. ఇది కార్తీక పురాణంగా తెలుగువారికి సుపరిచితమైంది. ఈ నెలలో రోజుకో అధ్యాయం చొప్పున నియమ నిష్ఠలతో పారాయణం చేయడం, తులసికోట దగ్గర, శివకేశవ ఆలయాల్లోనూ దీపాలు వెలిగించడం, ఏకభుక్తంతో నెలపొడవునా ఆధ్యాత్మికతను నింపుకోవడం, అన్నదానం లాంటివి ఈ వ్రత ఆచరణలలో ముఖ్యమైనవి.
కార్తీకమాస వ్రతమహాత్మ్యాన్ని స్కంద పురాణంలో వశిష్ఠుడు జనక మహారాజుకు, పద్మపురాణంలో శ్రీకృష్ణుడు సత్యభామకు సవిస్తరంగా వివరించారు. కార్తీక వ్రతాన్ని రెండు రకాలుగా ఆచరిస్తారు. మొదటిది చాంద్రమాస వ్రతం కాగా, రెండోది సౌరమాస వ్రతం. దీపావళి మర్నాడు వచ్చే కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి లేదా సూర్యుడు తులారాశిలో ప్రవేశించే ఘడియ నుంచి గాని ఈ మాసవ్రతాన్ని ఆరంభిస్తారు.
“నిర్విఘ్నం కురుమే దేవా దామోదర నమోస్తుతే” అంటూ కార్తీక దామోదరుడిని ప్రార్థించడం ద్వారా వ్రతారంభ సంకల్పానికి ఉపక్రమిస్తారు. సూర్యోదయానికి ముందే పుణ్యనదుల్లో స్నానంచేసి హరిహరుల్ని అర్చించడం, సాయంత్రం శివకేశవాలయాల్లో దీపాలు వెలిగించడం, పురాణ పఠనాలతో గడపడం లాంటివి ఇందులో ముఖ్యమైనవి.