హిందూ వివాహ తంతులో మాంగల్యధారణే అతి ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాళి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతోబాటూ వివిధ రూపాలు కూడా ఉన్నాయి. మానవులకు మనువాడటం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం.
వివాహ సమయం నుండి స్త్రీలు మంగళ సూత్రం ధరించడం భారతీయ సంప్రదాయం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళినాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్ధంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి పుట్టింది. సంస్కృతంలో 'మంగళ' అంటే శోభాయమానం, శుభప్రదం అనే అర్ధాలు కలవు. సూత్రం అంటే తాడు, ఆధారమైనది అని అర్ధాలు కలవు. సాధారణంగా మంగళసూత్రాన్ని 108 సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు కలిపికూడా కొందరు తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్రధారణ జరుగునపుడు ఈ మంత్రమును పఠిస్తారు.
" మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!! "
భారతదేశంలో వివాహం వెనుక ఎంతో శాస్త్రీయత ఉంది. ఇద్దరు వ్యక్తులకు వివాహం చేసేటప్పుడు చూసేది కేవలం రెండు కుటుంబాలు, రెండు దేహాల కలయిక కానే కాదు, అంతర్గతంగా ఇద్దరు వ్యక్తుల మధ్య గాఢమైన శక్తి సంబంధిత అనుకూలత ఉండాలన్నదే వారి ఉద్దేశం. అప్పుడే వివాహాన్ని నిశ్చయించే వారు. చాలా సార్లు అసలు వివాహం చేసుకోబోతున్న ఇరువురు ఒకరినొకరు పెళ్లి రోజు దాకా చూసుకునే సందర్భం కూడా ఉండేది కాదు. అయినా అది అంత ముఖ్యం కాదు, ఎందుకంటే వారి మధ్య సయోధ్యను కుదిర్చిన వారు, ఆ జంట కంటే ఆ విషయం బాగా తెలిసిన వారు. వధూవరుల వివాహ సమయానికి మంగళసూత్రాన్ని సిద్ధం చేసేవారు.
‘మంగళ సూత్రం' అనగా పవిత్రమైన సూత్రం'(దారం). ఈ పవిత్రమైన సూత్రాన్ని తయారుచేయటం విస్తృతమైన శాస్త్రం. కొన్ని వడికిన నూలు దారాలను తీసుకొని, పసుపు కుంకుమలు రాసి ఒక పద్దతిలో శక్తిమంతం చేస్తారు. ఒకసారి ముడి వేస్తే ఈ జీవితానికే కాక ఆపైన కూడా నిలిచి ఉండేలా మంగళ సూత్రం తయారుచేసే వారు. ఆ ఇద్దరిని కలిపి ముడి వేసుందుకు వారు వినియోగించిన విధానాలు కేవలం భౌతిక, మానసిక స్థాయిలోనే కాక వారి నాడులు కూడా కలిపి ముడి వేయటం వల్ల అదే జంట అనేక జీవితాల పర్యంతం అలా కలిసి ఉంటుంది.
భౌతికమైన, మానసిక, భావావేశ స్థాయిల్లో చేసేది ఏదైనా మరణంతో పూర్తి అయి పోతుంది. కానీ శక్తి స్థాయిలో చేసేది శాశ్వతంగా మిగులుతుంది. ఎంతో గాఢంగా, మన అవగాహనకు అందని విధంగా ఎలా ముడి వేయాలో తెలిసిన వారిచే ముడి వేయటం వల్ల ఆ బంధం గురించి పునరాలోచన చేసే ప్రశ్నే లేదు. ఇదే క్రతువు ఈనాడూ జరుగుతున్నా ఏమీ తెలియని వారిచేత జరుపుతున్నారు. వివాహం వెనుక ఉన్న శాస్త్రీయతను కోల్పోవటం వల్ల అది నిరర్ధకం. ఈ రోజుల్లో మనుషులు ప్రేమ గురించి మాట్లాడేటపుడు, వారు కేవలం భావోద్వేగపరంగానే మాట్లాడుతున్నారు. భావోద్వేగాలు నేడొకటి చెపితే రేపొకటి చెప్తాయి. నేడు మనం జీవిస్తున్న సంస్కృతిలో ఒకే జీవిత భాగస్వామితో జీవితాంతం కలిసి ఉండక్కరల్లేని పరిస్థితి వచ్చింది.
వివాహం అంటే స్వార్థజీవితం కాదని, జీవితాన్ని ఆనందంగా గడపడమని మహర్షలు చెబుతారు. ఆధ్మాత్మిక, సాంఘీక జీవితాన్ని బాధ్యతగా గడుపుతూ ఒకరితో ఒకరు సఖ్యంగా, చనువుగా, ప్రేమగా ఉండటమే దీని మూలమని పెద్దలు వివాహాన్ని నిర్వచించారు. జీవితంలో ఒకరితో ఒకరిని ఎక్కువ కాలం కలిపి ఉంచేది భార్యాభర్తల బంధం. ఆ బంధం పట్టిష్టంగా ఉండటానికి పెద్దలు కొన్ని మంత్రాలను నిర్ధేశించారు. వాటినే లౌకికంగా పెళ్లినాటి ప్రమాణాలని చెబుతారు. ఈ ప్రమాణాలను త్రికరణ శుద్దిగా ఆచరించిన దంపతుల సంసారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది. ఆ సంబంధం నిండునూరేళ్ళు పవిత్రంగా పచ్చగా ఉంటుంది.
వివాహ తంతులో మాంగల్య ధారణే అతి ప్రధానమైనది. మాంగల్యానికే మంగళసూత్రం, తాలి, తాళిబొట్టు, పుస్తె, శతమానం అనే పేర్లతో బాటు వివిధ రూపాలు కూడా ఉన్నాయి. ఇవి కులం, వంశానుసారం పలురూపాల్లో ఉంటాయి. మానవులకు మనువాడం ఎంత ముఖ్యమో, మనువాడటానికి మంగళసూత్రం అంతే ముఖ్యం. పెళ్లికోసం సమకూర్చుకున్న, ఇవచ్చిపుచ్చుకున్న ఇతర వస్తువులు, ఆభరణాలు అన్నీ రూపాంతరం చెందినా చివరి వరకూ వెంట ఉండేది తాళిబొట్టు మాత్రమే. 🙏🌺🙏