సంప్రదాయం ప్రకారం గా భోజన విధానం…!
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
1. భోజన సమయం లో చేయకూడనివి
భగవంతుడిని ఉపాసించే సమయంలో కాళ్ళూ చేతులూ కడుక్కుని, పరిశుద్ద వస్త్రాన్ని కట్టుకుని, సావధాన చిత్తంతో వ్యవహరించినట్లుగానే, భోజనం చేసే సమయంలో కూడా అంత శుచిగానూ, శాంతం గానూ వ్యవహరించాలని మన శాస్త్రాలు నిర్దేశించాయి. అవి చెప్పిన భోజన నియమాల ప్రకారం తలమీద కప్పుకుని, లేదా టోపీ పెట్టుకుని, పాగా చుట్టుకుని భుజించ కూడదు. కుర్చీ మీద కూచుని భుజించకూడదు. భుజించే సమయంలో చెప్పులు, బూట్లు వేసుకుని ఉండకూడదు. తోలు మీద కుర్చుని గానీ, బెల్ట్ పెట్టుకుని గానీ, బెల్ట్ వాచీని చేతిలో ధరించి కానీ భుజించ కూడదు.
పగిలి పోయిన పళ్ళాల్లో భుజించ కూడదు.
కలసి భోజనం చేయాల్సిన సందర్భాలలో ఇతరులు తనకోసం నిరీక్షించేలా చేయకూడదు.
కలసి భోజనం చేస్తున్నపుడు ముందస్తుగానే ముగించి, ఇతరుల భోజన విధానాన్ని ఆబగా చూడరాదు.
ఏక వస్త్రంతో భుజించరాదని అంటుంది దేవల స్మృతి.
ఇంట్లో భోజనం చేసేటప్పుడు అందరి చూపులూ పడేట్లుగా భుజించ కూడదు. తలుపులు వేసుకోవాలి. కనీసం పరదాలు వేసుకోవాలి. దృష్టి దోషం ఎంతటి వారిని అయినా కుంగదీస్తుంది.
బజార్లలో అమ్మే ఆహార పదార్థాలను కొని తినకూడదు. వాటిపై ఆకలిగొన్న మనుషులు, పశువులు మొదలైన వాటి దృష్టి పడి ఉండవచ్చు. పడవలో, భుజించ రాదనీ ఆపస్తంబ మహర్షి రాశారు.
అలాగే చాప మీద కూచుని కూడా భుజించ కూడదు. అరచేతిలో ఆహారం పెట్టుకుని, వేళ్ళన్నీ తెరచి ఉంచి, ఉఫ్, ఉఫ్ అని ఊదుకుంటూ ఎన్నడూ తినరాదని బ్రహ్మ పురాణం పేర్కొంది.
చెరకు, క్యారట్, పండ్లు మొదలైన ఏ పదార్థమైనా సరే పండ్లతో కొరికి, బయటకు తీసి తిరిగి తినరాదు.
ఆవు నెయ్యితో తడప కుండా ఆహారాన్ని తినకూడదు.
విక్రయాన్నం తినకూడదని శంకలిఖిత స్మృతి శాసించింది.
నేడు హోటళ్ళలో తినేవన్నీ విక్రయాన్నాల కిందకే వస్తాయి. ఒకసారి వండిన దాన్ని, కొంతసేపటి తర్వాత తిరిగి వేడి చేసి, వడ్డించడం లాంటివి ఈ హోటళ్ళలో పరిపాటి.
భుజించేటప్పుడు కామ క్రోధాదులు, హింసా వైరాల వంటి వాటికి మనసులో చోటుండ కూడదు.