ఆకాశ దీపం అంటే ఏమిటి? దేవాలయాలలో వెలిగించడం వెనుక అంతరార్ధం ఏమిటి?
శివ కేశవులకి ఎంతో ప్రియమైనది కార్తీకమాసం. ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి 'ఆకాశ దీపం' వెళ్లాడ దీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజ స్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకి వెళుతూ వుంటారు.
అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి ... ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి కారణం వుంది. ఆకాశ దీపం దూరంగా ఉన్న మానవులు దర్శించడానికి కాదు ... ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని శాస్త్రం చెబుతోంది. 'దీపావళి' రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృ దేవతలకు తర్పణం వదులుతుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు.