పెద్దలకు కూడా ఉపయోగపడే పంచతంత్ర కధలు -27.
ఆశకు అంతులేకపోతే..
నలుగురు యువకులు ఒకవూరిలో యెంతో స్నేహంగా వుండేవారు. వారివారి వృత్తులలో నైపుణ్యంకలిగి మంచిపేరు తెచ్చుకున్నారు, ఆ వూరిలో. అయితే, తమ నైపుణ్యానికి తగిన గుర్తింపురాలేదనీ, తమకు ధనంవిషయంలో అనుకున్న సంపాదనలేదని యెప్పుడూ అసంతృప్తితో వుండేవారు. అట్టి సందర్భాలలో, వున్నవూరుని, కన్నవాళ్ళనీ, వదిలి వెళ్లాలని అనుకొవడం సహజమేకదా ! ఆ వూరు తమ విద్యకు తగినప్రదేశం కాదని, వేరే పెద్దనగరానికి వెళ్ళ్లాలని తలపోసి, బయలుదేరారు. ఉజ్జయినీనగరం చేరుకున్నారు.
సిప్రానదిలో స్నానంచేసి, మహాకాళేశ్వరుని దర్శించుకున్నారు. అక్కడ భైరవానంద స్వామి వీరిని పలుకరించి యోగక్షేమాలు కనుక్కున్నారు. స్వామితో సంభాషిస్తున్నప్పుడు, ' మేము మాఅభివృధ్ధికోసం బయలుదేరాము. ఈ అన్వేషణలో మాకు విజయమో, వీరస్వర్గమో అనిసంకల్పించి వచ్చాము. సాహసించినందుకు మాకు ఫలితం దక్కుతుందనే అనుకుంటున్నాము. ' అన్నారు . కొద్దిసేపు వారితో మాట్లాడిన తరువాత, వారి దృఢమైన సంకల్పానికి, సంభాషణా ధోరణికి స్వామి యెంతో సంతోషించి, వారు నలుగురికీ, ఒక్కొక్కరిచేతిలో, ఒకగుళికను వుంచి, హిమాలయాల వైపు ప్రయాణం సాగించామని చెప్పారు. ' ఎక్కడైతే, మీ చేతిలోనుండి గుళిక జారి క్రిందపడుతుందో, అక్కడ సంపదకై వెదకండి. మీకు శుభంకలుగుతుంది. ' అని ఆశీర్వదించి పంపించారు.
కొంతదూరం వెళ్ళగానే, మొదటివాని చేతిలో గుళిక జారిపడింది. అక్కడ కొంత లోతుకు త్రవ్వగానే, చాలా పెద్ద పరిమాణం లో ' రాగి ఖనిజం ' కంటబడింది. మిగిలిన ముగ్గురితో మొదటివాడు, ' మీరు ముగ్గురూ కూడా కావలసినంత రాగి తీసుకువెళ్ళండి. ఇక అందరమూ వెనుకకువెల్దాము. ' అన్నాడు.. వారు దానికి వప్పుకోక, ' రాగిలో యేముంది ! ఇంకా ముందుకు వెళదాం. ' అని వారు బయలుదేరారు. మొదటివాడు మాత్రం తాను తీసుకువెళ్లగలిగినంత రాగితో వెనుకకుమరలాడు.
ఇంకొద్దిదూరం వెళ్ళగానే, రెండవవాని చేతిలో గుళిక క్రిందపడింది. అక్కడ త్రవ్వి చూడగా, వెండిఖనిజం బయటపడింది. రెండవవాడు సంతోషంగా కావలసినంత వెండి పోగుచేసుకుని వెనుకకు మరలుతూ, మిగిలిన యిద్దరినీ వెండితీసుకుని తనతో వెనుకకు రమ్మన్నాడు. వాళ్ళు ' ససేమిరా ' అని యింకాముందుకు బయలుదేరాడు.
ఇంకా కొద్దిదూరం మిగిలిన యిద్దరూ వెళ్తూవుండగా, మూడవవాని, నాలుగవ వాని చేతులలో గుళికలు క్రిందపడి, త్రవ్వగా బంగారంరాసులు కనిపించాయి. మూడవవాడు, తాను బంగారం పోగుచేసుకుని, నాలుగవ వానిని కూడా తీసుకోమనిచెప్పగా, ' నా గుళిక పొరబాటున క్రింద పడినట్లున్నది. నాకింకా యేదో పెద్దదే,రాసిపెట్టి వున్నది. నేను ముందుకువెళ్తాను ' అన్నాడు.
ఆ విధంగా చాలాదూరం కొండపై యెగబ్రాకగా , నాలుగవవాడు దారితప్పి, ఎటో వెళ్ళసాగాడు. ఆకలిదప్పులు, తెలిసివచ్చి, అటూయిటూ బిత్తరచూపులు చూడసాగాడు. వెనుకకు బంగారం దగ్గరకు వెల్దామంటే, దారి కనుక్కోలేకపోయాడు. ఇంతలో, ఒళ్ళు రక్తం కారుతూ, తలమీద ఇనుపగుండుమోస్తూ, ఒక వ్యక్తి వేదనపడుతూ కనిపించాడు.
' ఎవరు మీరు ? యిక్కడ యిలా యెందుకు వున్నారు ? ' అని నాలుగవవాడు అడిగిన తక్షణం, యెదుటివ్యక్తి తలపైన వున్న యినుపగుండు, ఇతనితలపైకి వచ్చి, వేదనపడ సాగాడు. అవతల వ్యక్తి గాయాలు మానిపోయి, హాయిగా నవ్వుతున్నాడు.
నాలుగువాడు ' ఏమిటి ఇదంతా ? మీ తలపై గుండు నాపైకి ఎందుకు వచ్చింది ? నేను యెప్పటిదాకా యిదిమోయాలి. అయ్యో భగవంతుడా ! నా దురాశ ఎంతపనిచేయించిందీ ! ' అని వాపోయాడు. దానికి ఎదుటి వ్యక్తి, ' నీ తలపై యిది యెంతకాలం వుండాలి అనేదానిపై, నాకూ అవగాహనలేదు. అయితే, నీలాగే, మరియొకడు ఎవరైనా వచ్చి, నిన్ను పలకరిస్తేచాలు, నీకష్టాలు గట్టెక్కుతాయి. నీవు, చదువుకున్నవాడవే అనుకుంటున్నాను గానీ, దురాశతో నాలాగా చిక్కుల్లోపడ్డావు. ' అని సమాధానం యిచ్చి కొండ క్రిందకు వడివడిగా వెళ్ళిపోయాడు.
నాలుగవవాడు, ఆశగా యింకెవరైనా తనను యీబంధంనుంచి తప్పించడానికి, తనలాగా రాకపోతాడా అని యెదురుచూస్తూనే వున్నాడు. మూడవవాడు, కొండపైకి తన స్నేహితుని గురించి వెదుకుతూ వస్తుండగా, క్రిందకు దిగుతున్న వ్యక్తి, విషయం చెప్పి, వెనుకకు మరల్చాడు మూడవవానిని.
చూశారా ! అత్యాశ యెంత అనర్ధాన్ని తెచ్చి పెడుతుందో !