Showing posts with label భక్తి. Show all posts
Showing posts with label భక్తి. Show all posts

Tuesday 17 January 2017

సుందరకాండము పారాయణము చేసినవారికి అనుకొన్న పనులు నెరవేరి కార్యసిద్ధి కలుగుతుంది.

శ్రీమద్రామాయణంలో సుందరకాండ ఐదవది. సుందరకాండము పారాయణము చేసినవారికి అనుకొన్న పనులు నెరవేరి కార్యసిద్ధి కలుగుతుంది.

సుందరకాండంలో హనుమంతుడు శతయోజన విస్తీర్ణం గల సముద్రమును ఆధారంలేని ఆకాశమార్గంలో పయనించి, ఆటంకాలను ఎదుర్కొని లంకాపట్టణములో ఒంటరిగా ప్రవేశించాడు. లంకలో అన్నిచోట్ల సీతను అన్వేషించి, అశోకవానములో శింశుపావృక్షమూలమున దీనస్థితిలో ఉన్న సీతను కనుకొన్నాడు.
తల బలప్రాక్రమములను శత్రువులకు తెలియజేయుటకు వనములను, ఉద్యానవనములను, ప్రాసాదములను ధ్వంసం చేసాడు. అక్షకుమారుడులాంటి రాక్షస వీరులను ఎందరినో సంహరించాడు.
ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రమునకు కట్టుబడి రావణ సభకు వెళ్లాడు. రావణునికి హితము పలికాడు. రాక్షసులు తన తోకకు నిప్పు పెట్టగా ఆ మంటలతో లంకానగరాన్ని దహనం చేసాడు.
స్వామికార్యము, స్వకార్యము నెరవేర్చి కార్యమును సానుకూలము చేసుకొని, తిరిగి సముద్రాన్ని లంఘించి వానరులను కలుసకుకొని సీతావృత్తాంతం చెలియజేసాడు.
హనుమంతుడు తనకు అప్పగించిన పనిని విజయవంతంగా నెరవేర్చుటకు అతడు పడిన శ్రమ, శక్తియుక్తులు కార్యసాధకుడు ఎట్లు ఉండవలెనని సుందరకాండ వలన తెలుస్తున్నది.
కార్యము అనగా మంచిపని. ఒక కార్యము చేయునప్పుడు మధ్యలో ఆటంకాలు వస్తుంటాయి. వాటిని ఓర్పుతోను, నేర్పుతోను, శక్తియుక్తులతోను అధిగమించాలి.
హనుమంతుడు సీతాన్వేషణముకై సముద్రమును వాయు మార్గంలో లఘించుచుండగా మొదట మైనాకుడు సముద్రములోనుంచి పైకి వచ్చి తనపై కొంతసేపు విశ్రాంతి తీసుకొని పొమ్మన్నాడు. తన ఆతిథ్యాన్ని స్వీకరించమని ప్రార్థించాడు.
మైనాకుడు సత్యగున ఆటంకము. కావున కార్య సాధకుడు మధ్యలో ఆగరాదు. రాముని కార్యము నెరవేర్చుటకు వెళుతున్నానని మైనాకుని మృదువుగా స్పృశించి, ప్రియవచనములతో స్వస్థత పరచి ఓర్పుగాను, నేర్పుతోను ఆటంకమును అధికమించి ముందుకు సాగాడు.
కొంతదూరము పోయిన తరువాత, దేవతలు పంపగా వచ్చిన సురస అను నాగాస్త్రీ హనుమంతుని అడ్డం నిలిచింది. హనుమంతుడు ముక్తిక్తితో, ఉపాయముతోను ఆమె నోటి యందు ప్రవేశించి బయటకు వచ్చెను. ఇది రజోగుణ సంబంధిత ఆటంకము. దీనిని ముక్తితో దాటెను.
మరికొంత దూరం ప్రయాణించగా ఛాయా గ్రాహియైన సింహిక అను రాక్షసస్త్రీ హనుమంతుని ఛాయను పట్టుకొని క్రిందికి లాగినది. ఇది తమోగుణ ఆటంకము. హనుమంతుడు సూక్షరూపం ధరించి, సింహికనోటిలో ప్రవేశించి ఆమె అవయవములను తన గోళ్ళతో పెకిలించి హతమార్చాడు.
కార్యసాధకుడు తనకు ఎదురైన సత్త్య, రజస్తమో ఆటంకములను ఓర్పు, నేర్పు, ముక్తి, శక్తిని ఉపయోగించి అధికమించెను.
లంకాపట్టణం చేరిన హనుమంతుడు తన స్వరూపమును చిన్నది చేసికొని సంచరించెను. దేశకాల పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించాడు. సురస, సింహికలను అధిగమించునపుడు, లంకాపట్టణంలో సీతాన్వేషణ చేయునపుడు సూక్ష్మరూపాన్ని ధరించాడు. సముద్రము లంఘించునపుడో, అశోకవనమును ధ్వంసము చేయునపుడు, రాక్షసులతో యుద్ధము చేయునపుడు, లంకా దహనము చేయునపుడు శరీరాన్ని పెంచాడు. పరిస్థితులబట్టి ప్రవర్తించాడు.
కార్యము నేరవేరాలనేదే దేశకాల పరిస్థితులను బట్టి కార్యసాధకుడు ప్రవర్తించాలి.
“తతః శరీరం సంక్షిప్య” (సుం. 1-205)
రావణుని అంతః పురంలో వివిధ భంగిమలతో అర్థనగ్నముగాను, నగ్నముగాను ఉన్న సౌందర్యవంతులైన స్త్రీలను చూచాడు. ఎన్నోరకములైన సువాసనలతో కూడిన ఆహార పదార్థములు పరికించాడు. కాని, హనుమంతుని మనస్సు చలింపలేదు. సీతను గురించి ఆలోచన తప్ప వేరే ఆలోచన అతని మనస్సులో లేదు. మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము కలిగిన జితేంద్రియుడు హనుమంతుడు.
కార్యసాధకుని మనస్సు వికారములకు లోనుకారాడు. మనోవికారము లేనప్పుడు, ఏది చూచినను దోషములేదు. ఆ కార్యసాధకుని కార్యం మీదనే దృష్టి ఉంటుంది.
శ్లో||మనోహిహేతుః సర్వేషామిన్ద్రి యాణాం ప్రవర్తెతే
శుభాశుభస్వవ్స్థాసు తచ్చమే సువ్యవస్థంమ్ (సుం. 11-41)
ప్రలోభములకు లొంగరాదు, విషయము లందు చలింపకూడదు.
హనుమంతుడు లంకలో అన్ని ప్రదేశములను సీతకై వెదకి ఆమె కనుపించక పోవుటచే దిగులు చెంది నిరుత్సాహ పడెను. తన శ్రమ వృథా అయినదని దైన్యము నొందెను.
కార్యసాధకునికి దైన్యము పనికిరాదు. నిరుత్సాహము చెందినను, దిగులు చెందినను కార్యము సిద్ధింపదు. కార్యనిర్వాహణకు దిగులు వదలి ధైర్యము వహించాలి. సర్వకార్యములు ఆ నిర్వేదము వలననే సానుకూలమగును.
శ్లో|| అనిర్వేదః శ్రియోమూలమనిర్వేదః పరంసుఖమ్
అనిర్వేదోహిసతతం సర్వార్దేషు ప్రవర్తకః (సుం. 12-10)
శక్తివంతుడైన హనుమంతుడు వెంటనే దైన్యమును విడచి, ధైర్యము తెచ్చుకొని సీత కనిపించునంతవరకు వెదకెదనని ధృడచిత్తుడయ్యెను. మనస్సును దిటవు చేసుకొన్నాడు. బ్రతికి ఉంటేనే ఏదైనా సాధించేది. చచ్చి సాధించేది ఏమున్నది? బ్రతికి ఉంటే సీతమ్మను కనుగొని రామయ్యకు చెప్పవచ్చు. మంచి కార్యములు చేయ వచ్చునని విరక్తిని వదలి సీతాన్వేషణకు ఉపక్రమించాడు.
శ్లో|| వినాశే బహావోదోషా జీవన్ భద్రాణిపశ్యంతి
తస్మాత్ర్వాణాన్ ధరిష్వామి ధ్రువో జీవిత సంగమః (సుం. 13-47)
ఇంతవరకు హనుమంతుడు తన శక్తియుక్తులను ఉపయోగించాడు. పురుషప్రయత్నం ఎంతచేసినా కార్యసాధకుడు దైవసహాయం కూడా కోరాలి. పురుష ప్రయత్నము, దైవానుకూలత ఉన్నప్పుడే కార్యసిద్ధి కలుగుతుంది.
శ్లో|| కచ్చి త్పురుష కారంచదైవంచ ప్రతిపద్యతే (సుం. 36-19)
సీత కనబడునట్లు అనుగ్రహించుమని, హనుమంతుడికిఉ వసు, రుద్ర, ఆదిత్య, అశ్వనీదేవతలను ప్రార్థించాడు. లక్ష్మణ సహితుడైన రాముని, జనకాత్మజ సీతను, యమ, వాయువులను కార్యసిద్ధికోరకు స్మరించి అశోకవనములోనికి ప్రవేశించి దీనముగా ఉన్న సీతాన్వేషణఉ శింశుపావృక్షము మూలమున కూర్చొనియుండుట చూచినాడు. హనుమంతుని ప్రయత్నం, దైవానుకూలత వలెనే తను కనుగొనగలిగినాడు. అంతా దైవ నిర్ణయం వలన జరుగుతుంది.
శ్లో|| వసూన్ రుద్రాం స్తథాదిత్య నశ్వినౌ మరుతోపిచ
నమస్కృత్యా గమిష్యామి రక్షసాం శోకవర్ధన (సు. 13-56)
శ్లో|| నమోస్తు రామాయ స లక్ష్మణామ
దేవ్వైచ తస్త్య జనకాత్మజాయ
నమోస్తు రుద్రేంద్ర యమానితేభ్యో
నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః (13-59)
సీతను చూచినా హనుమంతునికి ఈమె సీతయేనా? అను సందేహము వచ్చెను. పండితుడు కావున యుక్తి యుక్తములైన హేతువులతో ఆమె సీతయే అని నిర్థారణ చేసికొనెను. రావణుడు సీతను అపహరించి లంకకు తీసికొని వస్తున్నపుడు సీత కొన్ని ఆభరణములను తన చీరను చింపి ఆ ఉత్తరీయములో మూటగట్టి ఋష్యమూక పర్వతముపై ఉన్న వానరుల మధ్య జారవిదచినది. ఆమె వదలిన ఆభరణములు ఇప్పుడు ఆమె శరీరముపై లేవు.
రాముడు సీతవద్ద ఏ ఆభరణములు ఉన్నాయని చెప్పెనో అవన్నియు సీత శరీరముపై ఉన్నవి.
నగలను మూటగట్టి ఋష్యమూకముపై విడచినది. ఆ ఉత్తరీయము రంగు ఇప్పుడు ఈమె ధరించిన చీర రంగు ఒకటిగానే ఉన్నవి.
ఈమె రూపము రాముని రూపమునకు తగినట్లు ఉన్నది.
రావణుడు ప్రాతఃకాలమున సీతతో మాట్లాడిన విధానము గమనించిన హనుమంతుడు ఈమె సీతయే అని నిర్ణయించుకొనెను.
కార్యసాధకుడు యుక్తాయుక్తముగా, హేతుబద్ధముగా విచారించి తన కార్యము సానుకూలమయ్యేట్లు చూసుకోవాలి. కార్యసాధనకు కోపము, అహంకారము, దురభిమానము పనికి రాదు. ఇవి కలిగియున్నవారి కార్యము నెరవేరదు. తనకేమి తెలియకున్నను తెలిసిన వానివలె నటిస్తే కార్యము చెడుతుంది.
శ్లో|| ఘాత యంతి హి కార్యాణి దూతాః పండితమానినః (సుం. 30-38)
వివేకము కలిగి ఉండాలి. ఓర్పు ఉండాలి. కోపము పనికిరాదు. కోపచేసెదరు. ము వలన విచక్షణా జ్ఞానము కోల్పోయి చేయరాని పనులు చేసెదరు. తన కోపము వానన తనకే కాక తన ఆప్తులకు కూడా ఆపద సంభవిస్తుంది.
శ్లో|| వాచ్యావాచ్యం ప్రకుపితోనవిజానాతి కర్హిచిత్
నాకార్యమస్తి క్రుద్దస్య నావాచ్యం విద్యతే కృచిత్ (సుం.55-6)
రావణుని ఆజ్ఞానుసారము రాక్షస భటులు హనుమంతుని తోకకు నిప్పు అంటించారు. రావణుని మీద కోపముతో హనుమంతుడు లంకాపట్టణము దహనం చేశాడు. కోపంలో సీత లంకలో ఉన్నదన్న విషయాన్ని మరిచాడు. లంకా దహనమైన తరువాత సీత కూడా మంటలలో తగులబడినదేమో అని విచారిస్తాడు. ఆకాశ మార్గంలో సంచరిస్తున్న చారిణుల వలన సీత క్షేమంగా ఉందని తెలిసికొని సంతోషిస్తాడు. కార్య సాధకునికి నిగ్రహం కావాలి. కోపంతో తొందర పడితే కార్యము చెడిపోతుంది.
సీతాన్వేషణము చేసి తిరిగి సముద్రమును లఘించి వానరశ్రేష్ఠుల వద్దకు వచ్చి తను సీతను ఎలా కనుగొనినది వివరంగా చెప్పాడు. ఇంత కార్యము సాధించిననూ హనుమంతునిలో అహంకారము లేదు. ఈ కార్యము నా వలన జరిగినదని చెప్పలేదు. మీ ఆశీస్సుల వలన రాముని దయ వలన సీతను చూడగలిగినానని పలికాడు.
మహాత్ములు తమ శక్తి సామర్థ్యములతో కార్యము నెరవేర్చిననూ గర్వపడరు. అహంకారపూరితులు గారు. దైవసహాయము వలన జరిగినదని భావిస్తారు.
శ్లో|| రాఘవస్య ప్రభావేన భవ తాం చైవ తేజసా
సుగ్రీవస్యచ కార్యార్థం మయా సర్వమనుష్టితమ్ (సు 58-165)
సుందరకాండములో కార్యసిద్ధికి ఏమీ ఉండాలో, ఎట్లా ఉండాలో హనుమంతుని ద్వారా తెలిసికొని, దానిని ఆచరణలో ఉంచిన కార్యసిద్ధి కలుగుతుంది అనే దానిలో అంతరార్థము ఇదే.
కార్యసాధకునికి ఓర్పు, నేర్పు, శక్తియుక్తులు, ధైర్యము వినయము, వివేకము, యుక్తాయుక్త పరిజ్ఞానము ఉండాలి.
దైన్యము, కోపము, అహంకారము, దురభిమానము, గర్వము పనికిరాదు.
కేవలము మన ప్రయత్నముపైనే ఆధారపడక దైవ సహాయం కూడా అర్థించాలి. పురుష ప్రయత్నం దైవానుకూలత రెండూ ఉన్నప్పుడే కార్యసిద్ధి జరుగుతుంది. ఇది హనుమంతుని ద్వారా సుందరకాండములో చెప్పబడి యున్నది. సుందరకాండము పారాయణ చేసి విషయములను అర్థం చేసుకొని నిజజీవితంలో ఆచరిస్తే కార్యసిద్ధి కలుగుతుంది.
భక్తికి, శక్తికి, యుక్తికి హనుమంతుడే ఆదర్శము. అతని స్మరణవలన అన్నీ కార్యములు నిర్విఘ్నముగా నెరవేరుతాయి.
ఆంజనేయుడు మనం మధ్యనే ఉన్నాడు. ఎందరో భక్తులు ఆయనను పూజించి ఆయన సాక్షాత్కారాన్ని పొందగలిగారు. హనుమంతుడు మహాతత్త్వ పండితుడని ఉపనిషత్తుల సారాంశం. రామ మంత్ర రహస్యాన్ని పురాణకాలపు ఋషులందరు ఆంజనేయుని నుంచే గ్రహించారని తెలుస్తోంది. సమస్త పురాణాలలో ఆంజనేయుని ప్రస్తావన ఉంటుంది. నిరంతర రామనామ స్మరణంతో భక్తిలో మునిగిపోయే హనుమంతుడు తన భక్తులకు ఎటువంటి ఆపదలు కలుగనీయడు. కార్య సాధకుడు కాబట్టి తన భక్తుల కార్యములను నిర్విఘ్నంగా ముందుకు సాగెట్లు చూసుకుంటాడు. ఆంజనేయ భక్తులకు అపజయం అనేది లేదు.
శ్లో|| బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా
అజాడ్యం వాక్పటుత్యంచ హనుమ త్మ్సరణాద్భవేత్

దేవసేనపతిగా ఖ్యాతి ఎలా వచ్చింది?

పరమేశ్వరుడు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు ఋషులతో గూడి, సేనాపతిని కోరుకొనుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి. ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని, బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, ఆయనతో ఇట్లు విన్నవించుకొనిరి. “ఓదేవా! పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించియుంటిరి. ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో గూడి హిమవత్పర్వతమున తపమొనరించుచున్నాడు. కర్తవ్య విధానము నెరిగిన ఓ బ్రహ్మదేవా! ఈ (సెనాపతి) విషయమున లోకహితమును గోరి అనంతర కార్యమును గూర్చి ఆలోచిమ్పుడు. ఇప్పుడు మాకు మీరే దిక్కు”.
దేవతల ప్రార్థనను ఆలకించి, సరలోక సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు మృదుమధుర వచనములతో వారిని ఓదార్చుచు ఇట్లు పలికెను.
“పార్వతీదేవి శాప కారణముగా మీకు మీ పత్నులయందు సంతానము కలుగు అవకాశము లేదు. ఆమె వచనము తిరుగులేనిది. ఇది ముమ్మాటికిని సత్యము. ఇందు సందేహము లేదు. ఆకాశమున ప్రవహించు ఈ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. అతడు దేవసేనాపతియై, శత్రు సంహారకుడు కాగలడు. హిమవంతుని పెద్ద కూతురైన గంగ ఆ అగ్నిసుతుని (శివ తేజః ప్రభావమున అగ్నివలన తనయందు జనించిన సుతుని) ఆదరింప గలదు. అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడగును. ఇందు సంశయము లేదు”.
ఓ రఘునందనా! బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందరును సంతసించి, తాము కృతార్థులైనట్లు భావించిరి. అనంతరము వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, పూజించిరి. అంతట ఆ దేవతలందరునూ గైరికాదిధాతువులతో విలసిల్లుచున్న కైలాసపర్వతమునకు చేరి, పుత్రోత్పత్తికై అగ్నిదేవుని నియమించిరి. శివతెజమును భరించిన ఓ అగ్నిదేవా! ఈ దేవకార్యమును నెరవేర్పుము. శైలపుత్రికయైన గంగయందు ఆ శివ తేజస్సును ఉంచుము’ అని దేవతలు పలికిరి. అగ్నిదేవుడు దేవతలతో ‘అట్లే’అని పలికి, గంగాదేవి కడకు వెళ్ళి “ఓ దేవీ! గర్భమును ధరింపుము. ఇది దేవతలకు హితమొనర్చు కార్యము” అని నుడివెను. అప్పుడు గంగ ఆయన మాటలను విని దివ్యమైన స్త్రీ రూపమును ధరించెను. అగ్ని ఆమె సౌందర్యాతిశయమును జూచి, శివతేజమును ఆమెయందంతటను వ్యాపింపజేసెను.
ఓ రఘునందనా! అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నియును నిండిపోయెను. ఆ అగ్ని తేజస్సుయొక్క తాపమునకు తట్టుకొనలేక గంగాదేవి సర్వ దేవతలకును పురోహితుడైన అగ్నిదేవునితో “క్షణక్షణమునాకును బలీయమగుచున్న నీ తేజస్సును ధరింపలేకయున్నాను” అని పలికెను.  సర్వదేవతల కొరకై సమర్పించెడి ఆహుతులను స్వీకరించునట్టి అగ్నిదేవుడు గంగతో “ఓ దేవీ! ఈ శ్వేత పర్వతప్రదేశమున నీ గర్భమును ఉంచుము’ అని యనెను. మహా తేజస్వివైన ఓ పుణ్యపురుషా! రామా! గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి, మిక్కిలి తేజోరాశియైన ఆ గర్భమును తన ప్రవాహములనుండి అచట వదలెను. గంగానది గర్భమునుండి వెడలిన తేజస్సు మేలిమి బంగారము వలె కాంతిమంతమై యుండెను. కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు, అచటి వస్తువులన్నియును సువర్ణమయములాయెను. ఆ పరిసరములన్నియును రజిత మయములై నిరుపమానమైన కాంతితో వెలుగొందెను. ఆ తేజస్సు యొక్క తీక్ష్ణత్వము వలన రాగి ఇనుము పుట్టెను. ఆ రేతస్సు యొక్క మలము తగరము, సీసము ఆయెను. ఈవిధంగా ఆ తేజస్సు భూమిని జేరి,  వివిధ ధాతువులుగా రూపొందెను.
ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజః ప్రభావముచే ఆశ్వేతపర్వతమూ, అందలి శరవణమూ(రెల్లుగడ్డి) సువర్ణమయములై తేజరిల్లసాగెను. పురుష శ్రేష్ఠుడైన ఓ రాఘవా! అగ్నితో సమానమైన కాంతి గల ఆ బంగారము అప్పటినుండియు ‘జాతరూపము’ అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. అచటి తృణములు, వృక్షములు, లతలు, పొదలు మొదలగునవి అన్నియును స్వర్ణమయములాయెను. తదనంతరము అచట జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై, ఇంద్రుడు, మరుద్గణములు మొదలగు దేవతలు ఆరుమంది కృత్తికలను నియోగించిరి. “ఈబాలుడు మా అందరి యొక్క పుత్రుడగును” అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందము చేసుకొనిరి. పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలియ్యసాగిరి. అంత దేవతలందరును “ఈ బాలకుడు కార్తికేయుడు అను పేరుతో ముల్లోకముల యందును ఖ్యాతికెక్కును. ఇందు సంశయము లేదు” అని పలికిరి.
గంగాద్వారా అచటికి చేరిన శివతేజస్సు యొక్క ప్రభావమున పుట్టిన ఆ బాలుడు అగ్నివలె వెలుగొందుచుండెను. దేవతలా మాటలను విని, వారి ఆదేశమును అనుసరించి, కృత్తికలు ఆ బాలకునకు స్నానము చేయించిరి. ఓ కాకుత్స్థా! గంగాదేవి గర్భమునుండి స్ఖలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై, కారణజన్ముడైన ఆ మహానుభావుని ‘స్కందుడు’ అని పిలువసాగిరి. కృత్తికల పోషణ వలన అతనికి ‘కార్తికేయుడు’ అనియు పేరు ఏర్పడెను. అప్పుడు ఆ ఆరుగురు కృత్తికల స్తనములలో సమృద్ధిగా పాలు ఏర్పడెను. ఆరు ముఖములు గలవాడై ఆ బాలుడు ఆ ఆరుగురి నుండి స్తన్యములను గ్రోలెను. సుకుమార శరీరుడైనను ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారినుండి పాలుద్రాగి, మహిమాన్వితుడై అతడు తన పరాక్రమము చేత రాక్షస సైన్యములను జయించెను. దేవతలు అగ్నిదేవుని నాయకత్వమున సాటిలేని తేజస్వియైన ఆ బాలుని కడకు చేరి, అతనిని ‘దేవసేనాపతి’గా అభిషేకించిరి. 
పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు. కుమారస్వామి పై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్రపౌత్రులతో వర్ధిల్లును. తుదకు స్కంద సాలోక్య ఫలమును గూడ పొందును.

జాతకంలో కుజ గ్రహ విశ్లేషణ?

జాతక చక్రంలో కుజుడు జన్మలగ్నం నుండి 2, 4, 7, 8, 12 స్థానాలలో వుంటే కుజ దోషం గా వ్యవహరిస్తారు, ఈ స్థానాలలో కుజ గ్రహ సంచారములు వుంటే సమస్యలు వస్తాయి కానీ అవి కూడా కుజ మహా దశ జరిగే సమయంలోనే వస్తాయి. ఇతర దశలలో రానేరావు, చాలా సంధర్భాలో కుజ దోషం భంగమవుతుంది కూడా. ఈ విషయం తెలియక కుజ దోషం వుందని, కుజ దోష ప్రభావంతోనే సమస్యలు వచ్చాయని. కుజ దోషం..... కుజ దోషం..... అనుకుంటూ.... చాలా మంది భయపడుతూ, మానసిక వేధనతో జాతకులు మరియు వారి తల్లిదండ్రులుండటం ఈ మధ్య కాలంలో పరిపాటి అయినది.

కుజ దోషం పలు సంధర్భాలలో భంగమవుతుంది, ఇట్టి భంగమయ్యే సంధర్భాన్ని గమనించకుండా... ఇతర గ్రహ స్థితులచే ఏర్పడిన సమస్యలను... కుజ దోష ప్రభావం చే ఏర్పడ్డాయని తలుస్తుంటారు... ప్రస్తుతం వస్తున్నాయని, భవిష్యత్ కాలంలో వస్తాయని వాపోయే వారు ఎంతో మంది. అట్టి వారందరూ ధైర్యంగా ముందుకెళ్లుటకు వారి మనసులలో ఏర్పడ్డ అపోహలు తొలగించుటకై చేసే చిన్ని ప్రయత్నమే ఇది.

కుజుడు 2, 4, 7, 8, 12 స్థానాలలో వున్నప్పటికీ అవి కర్కాటక, సింహ రాశులలో లేక కర్కాటక సింహ లగ్నాలలో సంచారముంటే కుజ దోషం భంగమగును, మేష వృశ్చిక మకర సింహ ధనూ మీన లగ్నాలయందు, మరియు రాశుల యందు జన్మించిన జాతకులకు కూడా కుజ దోషం భంగమగును.

మిధున కన్య రాశులలో మరియు లగ్నాలలో జన్మించి జన్మ లగ్నానికి ద్వితీయ స్థానంలో కుజుడు వుంటే ఆ స్థాన దోషం భంగమగును, మకర కర్కాటక లగ్నాలలో లేక రాశులలో జన్మించి, సప్తమ స్థానాలలో కుజుడుంటే 7 వ స్థాన కుజ దోషం భంగమగును, ధనూ మీన లగ్నాలు మరియు రాశులలో జన్మించి అష్టమ స్థానాలలో కుజ గ్రహ సంచారముంటే 8 స్థాన కుజ దోషం ఉండదు, మిధున కన్య లగ్నాలు మరియు రాశులలో జన్మించి 12వ స్థానంలో కుజ దోషముంటే భంగమగును, పై విధంగా విశ్లేషిస్తే 95 శాతం జాతకులకు కుజ దోషమున్నప్పటికీ అది సంపూర్ణముగా భంగమవుతుందనే సత్యం గమనించాలి.
  
కుజ దోషముంటే కుజ మహా దశలోనే ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కుజ మహా దశ ఏయే నక్షత్రాలవారికి ఏయే వయసులో వస్తుందనేది తెలుసుకుంటే ఇంకా పూర్తిగా తెలుసుకున్న వారవుతారు, చిత్ర, ధనిష్ట మృగశిర నక్షత్ర జాతకులకు జన్మించిన తోడనే కుజ మహా దశ ప్రారంభమగును, ఏ పాదంలో జన్మించినప్పటికీ 7 సంవత్సరాల వయసు లోపలే  కుజ మహా దశ వెళ్లును. ఈ సమయంలో వివాహాలు చేయరు, కనుక చిత్ర ధనిష్ట మృగశిర నక్షత్ర జాతకులకు కుజ దోషముందనే భయాన్ని, బెంగను విడనాడండి.

రోహిణి హస్త శ్రవణ నక్షత్ర జాతకులకు జన్మ తోడనే చంద్ర మహాదశ ప్రారంభమై, ఆపై కుజ మహా దశ ప్రవేశించును, మొత్తం మీద 17 సంవత్సరాల వయసు నాటికి కుజ మహా దశ వెళ్లును, వివాహం 17 సంవత్సరాల తదుపరే చేస్తారు కనుక రోహిణి హస్త శ్రవణం జాతకులు కూడా కుజ దోషం వుందనే భయాన్ని విడనాడండి. 

ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్ర జాతకులకు కుజ దోషముండి  భంగం కాకుండా వుంటే దాని ప్రభావం కుజ మహా దశలోనే వస్తుంది, 113 సంవత్సరాలు జీవించిన తదుపరే కుజ మహా దశ వస్తుంది, ఈ జాతకులకు కుజ దోషముంటే ఇప్పుడేందుకు భయం, భయం చెందాల్సింది 113 సంవత్సరాలకు తరువాత , అది జరిగే పని కాదు.

పునర్వసు విశాఖ పూర్వాభాద్ర జాతకులు 90 సంవత్సరాలు వయసు దాటితే కుజ మహా దశ వస్తుంది, ఈ నక్షత్ర జాతకులకు కుజ దోషముంటే 90 సంవత్సరముల తర్వాత ఆలోచించాలి, ఇప్పుడు సమయం వృధా చేసుకుని కుజ దోషముందని ఆలోచించవద్దు.

పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర జాతకులకు వృద్దాప్యంలోనే కుజ దోషం వర్తిస్తుంది, అది సహజమే, కుజ దోష నివారణోపాయలు, పరిహార మార్గాలు ఎన్నో వున్నాయి వాటిని పాటిస్తూ ధైర్యంగా వుండటానికి ప్రయత్నించండి.

ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలు కుజ దోష భంగ నక్షత్రాలు, అనగా ఆశ్లేష కర్కాటక రాశి, జ్యేష్ఠ వృశ్చిక రాశి, రేవతి మీన రాశి ఈ మూడు రాశులలో జన్మించే జాతకులకు కుజ దోషమున్ననూ భంగమగునని శాస్త్ర వచనం. కనుక భయపడాల్సిన అవసరం లెనే లేదు.

అశ్వని భరణి కృత్తిక 1వ పాద జాతకులు కుజుని స్వస్థానమైన మేష రాశి లోను, మఖ పుబ్బ ఉత్తర 1 వ పాద జాతకులు కుజుని మిత్ర స్థానమైన సింహ రాశిలోను, మూల పూర్వాషాడ ఉత్తరాషాడ 1 వ పాద జాతకులు మరో మిత్ర స్థానమైన ధనూరాశిలోను జన్మిస్తారు, ఈ జాతకులకు కుజ దోషమున్నప్పటికీ కుజ స్వస్థాన  మిత్ర స్థానాలలో జన్మించినందున వారికి కుజ దోషం భంగమగునని శాస్త్ర వచనం, ఇలాంటప్పుడు ఆ నక్షత్ర జాతకులకు భయం అవసరం లేదు.

చివరగా వృషభ రాశి కృత్తిక 2,3,4 పాద జాతకులు, కన్యారాశి ఉత్తర 2,3,4 పాద జాతకులు మకర రాశి ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలలో జన్మించిన జాతకులు మాత్రమే కుజ దోష ఆలోచన చేయాలి. అయినా వీరందరికి 21 సంవత్సరాల వయసు రాగానే కుజ మహా దశ వెళ్లిపోతుంది. కావునా 22 సంవత్సరాల వయసు రాగానే వివాహం చేసుకోండి.

మొత్తం మీద కుజ దోషం గురించి బెంగపడనవసరం లేదు, ఇతర గ్రహ సంచారాలచే వచ్చే సమస్యలను కుజ దోషం వలన అనుకుని బాధపడే వారు చాల వరకు కనిపిస్తారు, పై విషయాలను గమనించి అందరూ ధైర్యంగా ఉంటారని ఆశిస్తున్నాను.
(పంచాంగ స్వీకరణ -  శ్రీనివాసగార్గేయ ఉవాచ)

__/\__సర్వేజనా సుఖినోభవంతు__/\__
ఓంప్రకాష్ విశ్వజ్ఞ - ఆస్ట్రో న్యూమరాలజిస్ట్

ఏకాదశి కథ

ఏకాదశి కథ
విష్ణువు మురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేస్తూ అలసిపోయి సింహవతి అనే గుహలో దాక్కున్నాడట. అప్పుడాయన శరీరం నుంచి ఒక అందమైన కన్య ఉద్భవించి మురుడితో యుద్ధం చేసి సంహరించిందట. ఆ కన్య పేరే ఏకాదశి. ఆమె ధైర్యసాహసాలకు సంతోషించిన విష్ణువు ఆమెను ఏంకావాలో కోరుకోమంటే తాను విష్ణువుకు ప్రియతిథిగా అందరిచేతా పూజలందుకోవాలని కోరుకుందట. తథాస్తు అన్నాడు నారాయణుడు. నాటి నుంచి జనులు ఏకాదశి తిథిని పరమపవిత్రమైనదిగా భావిస్తున్నారని భవిష్యోత్తరపురాణం చెబుతోంది.
ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.
తాత్త్విక సందేశం:
విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. కైవల్యోపనిషత్తు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు (నిహితం గుహాయాం విభ్రాజతే). అంతదగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్దేశించి, ఏకాదశీవ్రతాన్ని నియమంగా ఆచరించడమంటే, ఉపవాసం ద్వారా ఏకాదశేంద్రియాలను నిగ్రహించి, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించడమని భావం. పంచజ్ఞానేంద్రియాలు (కళ్లు, చెవులు, మొదలైనవి) పంచ కర్మేంద్రియాలు (కాళ్లు, చేతులు మొదలైనవి), మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారానే మనం పాపాలు చేస్తాం; ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారు.

పండగ ఆచరించు విధానం:
ఈరోజు పూర్తిగా ఉపవసించాలి; తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.

ఏకాదశి వ్రతం నియమాలు :
1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి.

2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి.

3. అసత్య మాడరాదు.

4. స్త్రీ సాంగత్యం పనికి రాదు.

5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు.

6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి.

7 .మరునాడు అన్నదానం చేయాలి..

ఏకాదశి రోజును హరిదినం, వైకుంఠదినంగా కీర్తించాయి ధర్మసింధు వంటి గ్రంథాలు. 
చంద్రమానం ప్రకారం పక్షము రోజులలో పదకొండవ తిథి ఏకాదశి. అధి దేవత - శివుడు.
సంవత్సరమునందు ప్రత్యేక మాసమున శుక్ల మరియు కృష్ణ పక్షమున రావు ఏకాదశి తిథుల పేర్లు క్రింది పట్టికలొనున్నవి.

మాసము మాస దేవడు శుద్ధ ఏకాదశి పర్వదినం బహుళ ఏకాదశి పర్వదినం

చైత్రము విష్ణువు కామదా వరూథినీ

వైశాఖము మధుసూదనుడు మోహినీ అపరా

జ్యేష్ఠము త్రివిక్రముడు నిర్జల యోగినీ

ఆషాఢము వామనుడు శయనీ, ప్రథమా కామికా

శ్రావణము శ్రీధరుడు పుత్రాద అజా

భాద్రపదము హృషీకేశుడు పరివర్తినీ ఇందిరా

ఆశ్వయుజము పద్మనాభుడు పాశాంకుశ రమా

కార్తీకము దామోదరుడు బొధినీ, ఉత్థాన ఉత్పత్తి

మార్గశిరము కేశవుడు ధృవ, మొక్షద సఫల

పుష్యము నారాయణుడు పుత్రాద, వైకుంఠఏకాదశి షట్తిలా

మాఘము మాధవుడు జయ, భీష్మఏకాదశి విజయ

ఫాల్గుణము గోవిందుడు ఆమలకీ పాపమొచనీ

అధికము (ఒకసారి,3 సంవత్సరములకు)
పురుషోత్తముడు పద్మినీ పరమా
మాసము/పక్షము/తిథి పర్వదినం

చైత్ర శుద్ధ ఏకాదశి కామదైకాదశి
చైత్ర బహుళ ఏకాదశి వరూధిన్యైకాదశి
వైశాఖ శుద్ధ ఏకాదశి మోహిన్యైకాదశి
వైశాఖ బహుళ ఏకాదశి అపరఏకాదశి
జేష్ఠ శుద్ధ ఏకాదశి నిర్జలైకాదశి
జేష్ఠ బహుళ ఏకాదశి యోగిన్యైకాదశి
ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలిఏకాదశి, శయనైకాదశి
ఆషాఢ బహుళ ఏకాదశి కామ్యైకాదశి
శ్రావణ శుద్ధ ఏకాదశి పుత్రఏకాదశి
శ్రావణ బహుళ ఏకాదశి అజైకాదశి
భాద్రపద శుద్ధ ఏకాదశి పరివర్తన్యైకాదశి
భాద్రపద బహుళ ఏకాదశి ఇంద్రఏకాదశి
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి మహాజ్జయేకాదశి
ఆశ్వయుజ బహుళ ఏకాదశి రమైకాదశి
కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్థానైకాదశి, బోధనైకాదశి
కార్తీక బహుళ ఏకాదశి ఉత్పత్యైకాదశి
మార్గశిర శుద్ధ ఏకాదశి ధృవైకాదశి, ఉత్తమైకాదశి
మార్గశిర బహుళ ఏకాదశి సఫలైకాదశి
పుష్య శుద్ధ ఏకాదశి వైకుంఠఏకాదశి, మోక్షఏకాదశి
పుష్య బహుళ ఏకాదశి తిలైకాదశి
మాఘ శుద్ధ ఏకాదశి భీష్మఏకాదశి, జయైకాదశి
మాఘ బహుళ ఏకాదశి విజయైకాదశి
ఫాల్గుణ శుద్ధ ఏకాదశి అమలవైకాదశి
ఫాల్గుణ బహుళ ఏకాదశి పాపవిమోచననైకాదశి

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles