చూసే కనుదోయి అభిప్రాయాల అల్పత్వం దగ్గరే ఆగిపోకుండా, మనసును తాకి పరవశింప జేసే సౌందర్యాన్ని అణువణువునా నింపుకున్న ప్రదేశాలు అదృష్టవశాత్తూ మన దేశంలో ఇంకా చాలానే మిగిలి ఉన్నాయి. వెర్రి పోకడల నవనాగరికత నీడలు పడని, కాలుష్యమింకా తెరలను పరువని నిష్కల్మష పుణ్యస్థలమైన శృంగేరి శారదా పీఠం తప్పకుండా అదే కోవకు చెందుతుంది.
జాతి వైరాన్ని మరచి ఒక పాము కప్పకు తన పడగ చాటున నీడనిచ్చిన మహత్తరమైన ప్రదేశంలో ఒక్కసారైనా కాలు మోపాలన్న ఆశా, అద్వైతాన్ని నలుదిశలా ప్రచారం చేసి, సనాతన భారతీయ ధర్మోద్ధరణ గావించిన శ్రీ శంకర భగవత్పాదులు ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించిన శారదా పీఠాన్ని దర్శించుకుని ఒక రెండు రోజులు హడావుడి లోకానికి దూరంగా, ప్రశాంతంగా గడపాలన్న కోరిక - తొలుత ఈ రెండే మా అకస్మాత్తు ప్రయాణానికి ప్రేరణలు. అయితే, అనుకోని వరాల్లా, అక్కడ ఉన్న రెండు రోజుల్లోనే ముందు వినని, చదువని (చదివినా ఇంత మనోహరంగా ఉంటాయని ఊహించని) మరికొన్ని ప్రదేశాలు కూడా చూడగలిగాము.